పీర్జాదిగూడ, నవంబర్ 27: పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్నిస్తున్నాయి. పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో చిన్నారుల కోసం క్రీడా పరికరాలు సమకూర్చారు. ఆ క్రీడా పరికరాలు చిన్నారులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన 22 ప్రకృతి వనాల్లో 35వేల మొక్కలను నాటారు.
ఈ వనాల్లో వాకింగ్ ట్రాక్, సిట్టంగ్ బెంచీలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల వద్దకు వచ్చే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలను సైతం ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు వల్ల ఆడుకోవాడానికి వచ్చే పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ఊయల, జారుడు బల్ల, రంగుల రాట్నం లాంటి క్రీడా పరికరాలతో ఆడుకుంటూ ఉదయం, సాయంత్రం ప్రకృతి వనాల్లో పిల్లలు సందడి చేస్తున్నారు. ఓ వైపు ప్రకృతి వనం పచ్చని అందాలు, మరోపక్క క్రీడాపరికరాలు చిన్నారులకు మానసికోల్లాసం కలిగిస్తున్నాయి. దీంతో పలు ప్రకృతి వనాలు సందర్శకులను అలరిస్తున్నాయి.
చాలా సంతోషంగా ఉంది..
ప్రకృతి వనాల్లో ఆడుకునేందుకు క్రీడా పరికరాలు ఏర్పాటు చేయడం తో చాలా సంతోషంగా ఉంది.ఇక్కడ ఆడుకునేందుకు జారుడు బల్ల రంగుల రాట్నం ఉన్నాయి. సాయం త్రం మా కాలనీలోని దోస్తులతో ఇక్కడకు వచ్చి ఆడుకుంటాం. రోజూ సాయంత్రం చాలా మంది దోస్తులం వచ్చి ఆడుకుంటాం.
– వివేకానందకాలనీ, గాయిత్రీ ప్రసాద్
ప్రతి రోజూ ఆడుకుంటున్నాం..
కార్పొరేషన్ పరిధి బుద్ధ్దానగర్ సాయిబాబా గుడి ఎదుట ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో క్రీడా పరిక రాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ మా దోస్తులతో ఉదయం, సాయం త్రం ఇక్కడికి వచ్చి ఆడుకుంటు న్నం. మా లాంటి చిన్నారులు ఆడుకోవడానికి క్రీడా పరికారాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం.
– బుద్ధ్దానగర్ కాలనీ, ఏ.యువన్