హైదరాబాద్ ఆట ప్రతినిధి, మే 28 ;గ్రామస్థాయి నుంచి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించతలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. మండల, జిల్లా స్థాయిలో 18 అంశాలకు చెందిన క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు హైదరాబాద్ వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు నగరానికి చేరుకోగా.. ఆదివారం పోటీలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా స్టేడియాల్లో పండుగ వాతావరణం తలపించింది. అభిమానుల కేరింతల నడుమ క్రీడాపోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ వైదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ -2023 చాంపియన్షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. గ్రేటర్లోని స్టేడియాల్లో 33 జిల్లాల క్రీడాకారులతో సందడిగా మారాయి. ఆదివారం లాల్బహుదూర్ స్టేడియంలో హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో అథ్లెటిక్స్ చాంపియన్షిప్లను రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రారంభించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ చాంపియన్షిప్ పోటీలను తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ప్రారంభించారు. మొట్టమొదటి సారి హైదరాబాద్ నగరంలో ఒకేసారి 18 క్రీడా అంశాలలో రాష్ట్రలోని 33 జిల్లాల క్రీడాకారులకు రాష్ట్రస్థాయి సీఎం కప్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించడంతో స్టేడియాల్లో పండుగ వాతావరణం కనిపించింది.
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో…
సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర స్టోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఆదివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. 4 రోజులపాటు కొనసాగే ఈ క్రీడా పోటీలకు 33 జిల్లాల నుంచి మొత్తం 1334మంది హాజరు కాగా అందులో 681 మంది పురుషులు, 653మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. క్రీడా పోటీలకు హాజరైన ప్రతి క్రీడాకారుడికి స్పోర్ట్స్ కిట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ కార్యదర్శి జగదీశ్ యాదవ్, సాట్స్ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, అనురాధ, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతూ..!
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో కొనసాగుతున్న సీఎం కప్-2023 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడా కారులకు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ క్రీడా పరికరాలను, టీ షర్ట్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా సామగ్రిని అందించినట్లు తెలిపారు. యువకులు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడా స్ఫూర్తితో క్రీడా పోటీల్లో పాల్గొని రాణించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల పట్ల ఆదరణ పెరిగిందని, సీఎం కేసీఆర్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. యువత క్రీడల్లో రాణించి రాష్ర్టానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి.. క్రీడలకు ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి క్రీడలకు, క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని సాట్స్ ఓఎస్డీ డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆదివారం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో రాణించాలని అన్నారు. యూసుఫ్గూడ కేవీబీఆర్ స్టేడియంలో బాస్కెట్బాల్ పురుషుల/మహిళల, రెజ్లింగ్ (పురుషుల) పోటీలు నిర్వహిస్తున్నట్లు సీఎం కప్ స్పోర్ట్స్ ఇన్చార్జి మేనేజర్ రవీందర్ తెలిపారు. నాలుగు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్కు తొలిరోజు అన్ని జిల్లాల నుంచి 621మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. బాస్కెట్బాల్లో 26 జట్లు పాల్గొంటుండగా క్రీడా పోటీల ఏర్పాట్లలో, నిర్వహణలో సుమారు 100 మంది అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ నార్మన్ ఐజాక్, రంగారెడ్డి డీఆర్డీఓ ప్రభాకర్, సంగారెడ్డి డీవైఎస్ఓ రామచందర్, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికిషన్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవీందర్, టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సీఎం కప్తో..రాష్ట్రంలో క్రీడా సంబురం
క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపును ఇస్తున్నదని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ జింఖానా క్రీడా మైదానంలో కొనసాగుతున్న సీఎం కప్-2023 పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ సీఎం కప్-2023 పోటీలు రాష్ట్రంలోనే అతి పెద్ద యువ క్రీడా సంబురం తీసుకువచ్చాయని తెలిపారు. వివిధ జిల్లాలోని రాష్ట్ర స్థాయికి విచ్చేసిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో నిఖిల్, జరిన్, ఈషా సింగ్ లాంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. వివిధ గ్రామాలు, జిల్లాల నుంచి నగరానికి విచ్చేసి.. రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం అద్భుతమైన అవకాశం అని చెప్పారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ 2023 పోటీలను క్రీడా ప్రేమికులు వీక్షించి, క్రీడాకారులను ప్రోత్సాహించాలన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం ప్రొఫెషనల్ కోర్సులలో 0.5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాలతో 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ సుధాకర్, ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, ఇన్చార్జి సాయన్న, పీడీలు, పీఈటీలు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన వేలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు.