కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటా పెరుగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తున్నది. ఈ ఏడాది 8 నెలల్లో లక్షకు (1,02,323)పైగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఐదేండ్ల నుంచి ఇప్పటి వరకు 4.55 లక్షలకు విద్యుత్ వాహనాల సంఖ్య చేరుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వినియోగానికి ప్రోత్సాహం అందిస్తుండటంతో అందుకు సంబంధించిన రంగాలు సైతం అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఐదేండ్లలో నమోదైన ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా గూడ్స్ , పబ్లిక్ సర్వీస్ వెహికిల్స్ ఉండటం విశేషం.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
గూడ్స్ వెహికిల్స్కు క్రేజ్..
పెరిగిన ఇంధన ధరలతో నగరవాసులు ప్రత్యామ్నాయంగా ఈవీల వైపే చూస్తున్నారు. అందుకు సంబంధించిన ఈవీ కంపెనీలు విద్యుత్ వాహనాలను అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దీనికి తోడు విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను కూడా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తున్నది. ఇప్పటికీ రెడ్కో ఆధ్వర్యంలో గ్రేటర్లో 90 ఈవీ చార్జింగ్ స్టేషన్లను వినియోగంలోకి తెచ్చింది.
2018 నుంచి..
విద్యుత్ వాహనాల్లో గూడ్స్ వెహికిల్స్, పబ్లిక్ సర్వీస్ వెహికిల్స్ దూకుడు పెంచాయి. టాటా ఏసీ, దోస్త్, డీసీఎంలు, కంటెనర్లు, బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్ తదితర వాహనాలు జోరుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. 2018లో 4,208 గూడ్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ వెహికిల్స్ ఉండగా అవి ఏటా పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ప్రస్తుతం(ఆగస్టు 31) వరకు 68,900 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2018 నుంచి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా గూడ్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అన్ని రకాల మొత్తం విద్యుత్ వాహనాల్లో వీటి రిజిస్ట్రేషన్ సింహభాగంలో ఉంది.
ఈవీ నగరంగా..
విశ్వనగర హంగులతో కూడిన హైదరాబాద్ నగరంలో ఈవీ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పే వారికి పలు రాయితీలతో పాటు రుణ సౌకర్యం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నది. వీటితో పాటు ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలను ఇస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఈవీ వాహనాల తయారీలో 23 స్టార్టప్ కంపెనీలున్నాయి. అంతేకాదు గత ఏడాదిలో ఐదు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు రూ.5147 కోట్ల పెట్టుబడులతో నగరంలో తమ తయారీ యూనిట్లను పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో ప్రధానంగా ట్రైటోన్ ఎలక్ట్రిక్ రూ.2100 కోట్ల వ్యయంతో జహీరాబాద్ నిమ్జ్లో తన తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నది. ఇలా చాలా కంపెనీలు ఈవీలో ఆసక్తి చూపిస్తున్నాయి. అన్ని ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నాయి. పోర్షా, లాంబార్గిని, బ్యుగాటీ, ఆడి, స్కోడా తదితర కంపెనీలు అన్ని రకాల వాహనాల ఉత్పత్తికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే టొయోటా, నిస్సాన్, వోల్వో, టెల్సా, హోండా, యమహా, ఓలా, టాటా ఎవిజన్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
ఉద్యోగ అవకాశాలు అదే స్థాయిలో..
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరగడం వల్ల డిజైన్, టెస్టింగ్, బ్యాటరీల ఉత్పత్తి, నిర్వహణ, సేల్స్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ తదితర ఎన్నో రంగాల్లో శ్రామిక శక్తి అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంజినీరింగ్లో అన్ని బ్రాంచీల వారికీ, డిప్లొమా నుంచి సాధారణ డిగ్రీలు, పీజీల వరకు ఎంతో మందికి రకరకాల ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ పరిశోధన, ఉత్పత్తి, రిపేర్లు చేసే టెక్నీషియన్లు తదితర అవసరాలు పెరుగుతాయి. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, మెటీరియల్స్, మెకానికల్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ టెక్నీషియన్స్, మెకానిక్ డ్రాఫ్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, థర్మల్ ఇంజినీర్, ఎంబెడెడ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, ప్రోటో డెవలప్మెంట్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, టెస్టింగ్ ఇంజినీర్ ఇలా పలు రకాల ఇంజినీర్లు ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తిలో అవసరమవుతారు. వీటితో పాటు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంజినీర్, బ్యాటరీ, అల్గారిథమ్స్ ఇంజినీర్, బ్యాటరీ సేఫ్టీ ఇంజినీర్, పవర్ ట్రెయిన్ ఇంజినీర్, డేటా అనలిటిక్స్ ఇంజినీర్ తదితర రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు భారీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చార్జింగ్ స్టేషన్ల్ల ఏర్పాటు..
విద్యుత్ వాహనాల వినియోగం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించింది. ద్విచక్రవాహనానికి చార్జింగ్ 3 గంటలు ఫుల్ చేస్తే.. ఆ వాహనం సగటున గంటకు 50 కిలో మీటర్ల వేగంతో 130 కిలో మీటర్లు నుంచి 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇందుకు 2 యూనిట్ల విద్యుత్ ఖర్చువుతుంది. ఇందుకు సంబంధించిన స్టేషన్లు ఉన్నాయి. కాగా, గ్రేటర్లో ఈసేవ వనస్థలిపురం, నాగోల్ ఆర్టీఏ పాయింట్, అంబర్పేట్ పీఎస్ సమీపంలో, గచ్చిబౌలి స్టేడియం ఎదురుగా, దుర్గం చెరువు జీహెచ్ఎంసీ పార్కింగ్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓల్డ్ పాస్పోర్ట్ ఆఫీస్, శేరిలింగంపల్లి, ఐఐటీ పార్కింగ్, సరూర్నగర్, హెచ్ఎండీఏ ట్రాక్ పార్కింగ్ తదితర ప్రాంతాల్లో ఈవీ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈవీ చార్జింగ్ కేంద్రాల సమాచారమంతా ఒక్క క్లిక్లో అందుబాటులోకి తీసుకొచ్చింది రెడ్కో సంస్థ. ‘టీఎస్ఈవీ’ యాప్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు దగ్గర లొకేషన్ ఎక్కడ ఉంది? పేమెంట్ ఎంత? తదితర వివరాలు అన్నీ అందుబాటులో ఉండనున్నాయి.