సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడంతో మంత్రివర్గంలో గ్రేటర్ బెర్త్ను భర్తీ చేయడం పార్టీ అధిష్ఠానానికి ఒక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా… కనీసం అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకొని ఎమ్మెల్సీ తద్వారా మంత్రివర్గంలో బెర్త్ను ఖాయం చేసుకోవాలని పలువురు నేతలు నిన్నటిదాకా అటు హస్తిన.. ఇటు గాంధీభవన్లో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు కూడా ముంచుకొస్తుండటంతో అటు ఎమ్మెల్సీ, ఇటు ఎంపీ.. దేని కోసం పైరవీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలోనూ విజయం సాధించలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన సమయంలో ఇదో చిక్కుముడిగా మారింది. ఇప్పటికే కొలువుదీరిన ప్రభుత్వంలో పలు ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యం కల్పించారు. మంత్రివర్గంలో మిగిలిన ఆరు బెర్తుల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్కు కూడా స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ క్రమంలో హస్తం పార్టీ గుర్తుపై గెలిచిన వారు ఎవరూ లేకపోవడంతో ఈ స్థానాన్ని భర్తీ చేయడం ఎలా? అనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం కాస్త తర్జనభర్జన పడుతూనే ఉంది.
అయితే గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు కీలక నేతలు ఎలాగైనా మంత్రివర్గంలో బెర్త్ను ఖరారు చేసుకునేందుకు తమ మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎలాగూ ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని ఖాళీగా ఉండటంతో పాటు ఇకముందు మరికొన్ని ఖాళీలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో బెర్త్ను ఖరారు చేసుకుంటే ఎలాగూ ఎమ్మెల్సీ దక్కుతుంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో తమ పేరును ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు అసెంబ్లీలో అవకాశం ఇచ్చినందున ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో అవకాశం రాని నేతలు పోటీ పడుతున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ సమయంలోనే గ్రేటర్ పరిధిలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది తేలనుంది.
ముంచుకొస్తున్న పార్లమెంటు…
మంత్రివర్గంలో గ్రేటర్ బెర్త్ ఖరారు ఒకవైపు ఆలస్యం అవుతుండగా… మరోవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తూనే ఉన్నాయి. మునుపటికంటే ఒకటి, ఒకటిన్నర నెలల ముందే షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలకు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటం ఇబ్బందికరంగా తయారైంది. పలువురు నాయకులు తొలుత గ్రేటర్ బెర్త్… అక్కడా నిరాశ ఎదురైతే ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించాలని అనుకున్నారు. కానీ రెండూ ఒకే సమయంలో రావడంతో దేని కోసం ప్రయత్నం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఎలాగూ మజ్లిస్ కంచుకోట కావడంతో అటువైపు ఎవరూ పెద్దగా దృష్టి సారించరు. మిగిలిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల టికెట్లను అడగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు మంత్రి పదవి, కాకపోతే ఎంపీ టికెట్ రెండింటిని ఎలా అడగాలో తెల్వక అయోమయంలో పడిపోయారు. ఇదే తరుణంలో ‘అన్ని చోట్లా మీ పైరవీలేనా?’ అని ప్రశ్నించేందుకు ఎలాగూ అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రానివారు కాచుకు కూర్చోవడంతో వారిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా వీరికి ఒక సవాల్గా మారింది.