కందుకూరు, డిసెంబర్ 9 : అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది వివరాలను టీపోల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల వారీగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది. ఓటర్ల జాబితాను జీపీ, వార్డుల వారీగా విభజించి.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నది. ఈ ప్రక్రియను నెలరోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నది.
కందుకూరు మండల పరిధిలోని 35గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తమ పంచాయతీ, వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందోనని నేతలు ఆశాగా ఎదురుచూస్తున్నారు. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు రిజర్వేషన్ల విషయంలో తర్జన బర్జన పడున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన అనంతరం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం చేస్తుండటంతో గ్రామాల్లో మరో మారు రాజకీయం వెడెక్కుతుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికలపై చర్చించుకుంటున్నారు. కందుకూరు మండల పరిధిలో ఉన్న 35 గ్రామపంచాయతీల్లో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇక పల్లెల్లో ఎన్నికల సందడి మొదలుకానున్నది.