ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం వందల మంది రోగులు..
కేసీఆర్ కిట్టుతో పెరిగిన ప్రసవాల సంఖ్య
టెలి మెడిసిన్తో మెరుగైన సేవలు
హర్షం వ్యక్తం చేస్తున్న జవహర్నగర్ ప్రజలు
జవహర్నగర్, ఏప్రిల్ 24 : గతంలో జబ్బు చేస్తే… నేనే రాను బిడ్డో… సర్కారు దవాఖానకు అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాట పట్టారు. మెరుగైన వసతులు, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రజలకు అందుబాటులో బస్తీ, పల్లెల్లో దవాఖానలు ఏర్పాటు చేసి పలు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీంతో ప్రజలు జబ్బు చేస్తే ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. కేసీఆర్ కిట్టుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సౌకర్యాలు కల్పిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందుతున్న వైద్య సేవలు..
జవహర్నగర్ కార్పొరేషన్లో ఉన్న పీహెచ్సీలో రోగులకు సేవలు అందించడంతో పాటు ఆసుపత్రిలో ఆరు పడకలున్నాయి. ప్రతి బుధ, శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజు 100 మంది వరకు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. 24 గంటలు అత్యవసర సేవలు, గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, తల్లీబిడ్డ సంరక్షణ, సాధారణ కాన్పులు, ప్రసవానంతరం వాహన సదుపాయం, క్షయ, కుష్టు వ్యాధి నివారణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. టెలి మెడిసిన్తో రోగులకు మెరుగైన సేవలందిస్తున్నారు.
కేసీఆర్ కిట్టుతో పెరిగిన ప్రసవాలు..
కేసీఆర్ కిట్టుతో ప్రసవాల సంఖ్య పెరిగింది. 2022-23 మార్చి వరకు 98శాతం కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ప్రతి వారం గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి పాలనలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు తక్కువగా జరిగేవి. కేసీఆర్ కిట్టుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, వీటిలో సాధారణ కాన్పులు కూడా పెరిగాయని వైద్యులు పేర్కొన్నారు.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.రోగులకు మందులు అందజేస్తున్నం, అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేసీఆర్ కిట్టుతో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రతి ఒక్కరికి సాధారణ కాన్పు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గర్భిణులకు ప్రతి వారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నాం. టెలి మెడిసిన్ ద్వారా కూడా ఉత్తమ సేవలు అందిస్తున్నాం.
–పద్మావతి, మెడికల్ ఆఫీసర్,జవహర్నగర్ పీహెచ్సీ
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పని చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పల్లెకు, బస్తీకి దవాఖానలు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ జనాభాకు అనుగుణంగా 100 పడకల దవాఖాన ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావుకు విన్నవించాం. నగరపాలక సంస్థలో ఇప్పటికే పల్లె దవాఖాన ఏర్పాటు చేయగా, మరో రెండు బస్తీ దవాఖానలకు స్థలాలను పరిశీలించాం. త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తాం.కార్పొరేషన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం.
– మేకల కావ్య, మేయర్, జవహర్నగర్