పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే
సీఎం చొరవతో రూ.100 కోట్ల నిధి.. రూ.42 కోట్లు విడుదల
నియోజకవర్గాల్లో విలేకరులకు స్థలాలు లేదా ఇండ్లు కట్టించాలి
జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి పాత్రికేయులేనని.. ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆయన ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఏడేండ్ల క్రితం సీఎం కేసీఆర్ తెలంగాణ మీడియా అకాడమీకి స్వయంగా వచ్చి జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని ప్రకటించారని, ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేశారని, వీటి డిపాజిట్లపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమానికి అకాడమీ చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇప్పటివరకు రూ.16 కోట్లను జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అకాడమీ సాయం చేసిందని, 490 మంది మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, ఐదేండ్లపాటు నెలకు రూ.3 వేల పింఛన్, పిల్లలకు ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుకోవటానికి ప్రతినెల రూ.వెయ్యి ట్యూషన్ ఫీజు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలు, ఇతర దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న 122 మంది జర్నలిస్టులకు రూ.50వేల ఆర్థిక సాయం, కొవిడ్ బారినపడిన 4వేల మంది జర్నలిస్టులకు ఆర్థికసాయం చేసినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల హెల్త్కార్డులను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నైతిక విలువలు పాటిస్తూ రాణిస్తేనే పాత్రికేయ వృత్తికి న్యాయం చేయగలుగుతామని సూచించారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్యాదవ్ వారి నియోజకవర్గాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తున్నారని, మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పనిచేసే విలేకరులకు స్థలం లేదా డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
9 జిల్లాల్లో శిక్షణ తరగతులు పూర్తి
రాష్ట్రంలో 9 జిల్లాల్లో జర్నలిస్టుల శిక్షణ తరగతులు నిర్వహించామని, వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు అకాడమీ ప్రచురించి ఒక కిట్ను అందజేస్తుందని, త్వరలో మీడియా అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేందుకు తనపూర్తి సహకారం ఉంటుందని అన్నారు. కరోనా సమయంలో విలేకరులు వార్తల సేకరణకు ఎంతో కృషి చేయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేశారు. సీనియర్ జర్నలిస్టు చిల్లా మల్లేశం, గోవింద్రెడ్డి హాజరై వృత్తి మెళకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షుడు ఇస్మాయిల్, హైదరాబాద్ జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు యోగానంద్, కార్యదర్శి నవీన్కుమార్, కట్టా కవిత పాల్గొన్నారు.