కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం.. అని మనిషి జీవిత సారాన్ని వర్ణించాడో కవి. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న.. అనేది నేటి మాట. మనిషి మృతి చెందినా.. అతడి శరీరంలోని అవయవాలు కొందరికీ పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. ఒకప్పుడు అవయవదానం అంటే చాలా మందిలో మూఢ నమ్మకాలు.. అపోహలు ఉండేవి. కానీ గడిచిన పదేండ్ల కాలంలో పరిశీలిస్తే… ప్రజల్లో అవయవదానంపై క్రమంగా అవగాహన పెరుగుతున్నది. ఇతరుల ఆయుష్షును పెంచేందుకు తమ వారి అవయవాలను ఇచ్చేందుకు దాత కుటుంబసభ్యులు అంగీకరించడమనేది గొప్ప విషయం. ఇందుకు జీవన్దాన్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల కృషి అనిర్వచనీయం. పదేండ్ల కిందట నామమాత్రంగా ఉన్న అవయవదానం ఇప్పుడు వందల సంఖ్యలోకి చేరింది. అవయవదానంలో ఒకప్పుడు వెనుకబడిన తెలంగాణ… ఇప్పుడు తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలవడం శుభపరిణామం. జీవన్దాన్ కింద అవయవదానం ద్వారా అనేక మందికి పునర్జన్మ ప్రసాదించడంలో నిమ్స్ వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నది. 2013 నుంచి ఇప్పటివరకు నిమ్స్లో 31 మంది దాతల ద్వారా ఏకంగా 384 మూత్రపిండ, 18 కాలేయ, పది గుండె, రెండు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఉస్మానియాలోనూ 77, గాంధీలో 12 అవయవ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం.. లిప్త పాటు జీవితం! మనిషి జీవిత సారాన్ని రెండు ముక్కల్లో వర్ణించాడు ఓ కవి. కానీ వాస్తవానికి జీవితమంటే ఒక జన్మ కాదు.. మరణించినప్పటికీ కొంతమందికి పునర్జన్మ ప్రసాదించి వారిలోనూ తిరిగి బతికి ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. అదే.. అవయవదానం. కన్నుమూసినా.. మరి కొంతమంది కళ్లల్లో ఆనందాన్ని నింపే ఈ అదృష్టాన్ని గతంలో చాలామంది కొట్టిపడేసేవారు. కొన్నేండ్ల కిందటి వరకు అవయవదానం అంటే చాలా మందిలో మూఢ నమ్మకం.. అపోహ ఉండేవి. కానీ గడిచిన పది సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే.. ప్రజల్లో అవయవదానంపై క్రమంగా అవగాహన పెరుగుతున్నది. ముఖ్యంగా తమవారు చనిపోయినా ఇతరుల ఆయుష్షును పెంచేందుకు వారి అవయవాలను ఇచ్చేందుకు దాత కుటుంబ సభ్యులు అంగీకరించడమనేది గొప్ప విషయం. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవన్దాన్ విభాగంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా విశేషంగా కృషి చేసి ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి. తద్వారా పదేండ్ల కిందట నామమాత్రంగా ఉన్న అవయవదానం ఇప్పుడు వందల సంఖ్యలోకి రావడం శుభపరిణామం. ఈ నేపథ్యంలోనే అవయవదానంలో ఒకప్పుడు ఎక్కడో ఉండే తెలంగాణ.. ఇప్పుడు తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలవడం ప్రతి ఏటా వందలాది మందికి పునర్జన్మను ప్రసాదించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు దోహదపడుతుంది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
నిత్యం అనేక మంది పలు అనారోగ్య కారణాలతో అవయవాలు పని చేయక మృత్యువాతపడుతున్న సంఘటనలు చూస్తూనే ఉంటాం. ఇది నాణేనికి ఒకవైపు! రోడ్డు ప్రమాదాలు.. ఇతర కారణాలతో బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించకపోవడంతో ఇతరులకు పునర్జన్మ ఇచ్చే అవకాశముండి కూడా నిరుపయోగమవుతుంది. నాణేనికి ఇది రెండో వైపు!! పదేండ్ల కిందట ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండేవి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ పరిణామాల్లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి.
అవయవదానం అంటే ససేమిరా అనే స్థితి నుంచి స్వచ్ఛందంగా అవయవదానానికి బతికి ఉండగానే అంగీకారం తెలిపే స్థాయికి ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకే తెలంగాణలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా వందలాది మంది అవయవదానం ద్వారా తమ ఆయుష్షు పెంచుకుంటున్నారు. అయితే దీనిని కెడావర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఇలా కాకుండా లైవ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది. అంటే బాధితుల కుటుంబ సభ్యులే అవయవాన్ని దానం చేయడం ద్వారా అవయవ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహిస్తారు.
అవయవదానంపై గతంలో అవగాహన లేకపోవడం ఒకవంతైతే.. ప్రభుత్వపరంగానూ ఇందుకు ఒక వేదిక లేకపోవడం ప్రధాన లోపంగా ఉండేది. 2012లో నిమ్స్ కేంద్రంగా జీవన్దాన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జీవన్దాన్ ద్వారా తొలి అవయవదానం 2013 జనవరి 13న జరిగింది. ఎవరైనా బ్రెయిన్డెడ్ అయితే అవయవదానం చేయడానికి దాత కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం ఒక సమస్య అయితే.. ఒకవేళ అంగీకరించినా సంబంధిత వ్యక్తులు, వైద్యులు ప్రభుత్వపరంగా అనుమతులు తీసుకోవడం అందుకు పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉండటం మరో సమస్యగా ఉండేది. కానీ జీవన్దాన్ వచ్చిన తర్వాత వివిధ సమస్యలతో బాధపడుతూ అవయవాలు కావాల్సిన వారు జీవన్దాన్లో నమోదు చేయించుకుంటున్నారు. తద్వారా అక్రమాలకు కూడా తెరపడింది. అయితే తొలినాళ్లలో జీవన్దాన్ నిర్వహణ అనేది పకడ్బందీగా లేకపోవడంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలే చొరవ తీసుకొని అవయవదానం కోసం శ్రమించాల్సి వచ్చేది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జీవన్దాన్ నిర్వహణను హేతుబద్దీకరించడంతో పాటు బలోపేతం చేసింది. నిర్వహణలో భాగంగా కార్పొరేట్, ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం పెరిగింది. దీంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించడంతో ప్రజల్లోనూ మార్పు వచ్చింది. తద్వారా కొన్ని సంవత్సరాలుగా అవయవదానం సంఖ్య గణనీయంగా పెరిగింది. జీవన్దాన్లో నమోదు చేయించుకున్న సీనియారిటీ, అత్యవసరం.. ఇలా పలు కోణాల్లో ప్రాధాన్యతలను గుర్తించి ఎప్పటికప్పుడు అవయవదానం ద్వారా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని పునర్జన్మను పొందుతున్నారు.
ఏదైన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో రోగి బ్రెయిన్డెడ్కు గురైనట్లు సంబంధిత వైద్యులు ధ్రువీకరిస్తే వెంటనే ఆ సమాచారాన్ని వైద్యులు జీవన్దాన్ సంస్థకు చేరవేస్తారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ బృందం బ్రెయిన్డెడ్కు గురైన జీవన్మృతుడి వద్దకు చేరుకుని అతడి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు జీవన్మృతుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తే అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే అవయవ దాతకు సంబంధించిన వయస్సు, బ్లడ్గ్రూప్ వివరాలు సేకరిస్తారు. వాటిని ఆన్లైన్లో రిజిస్టర్ అయివున్న రెసిపియెంట్ (అవయవ దానం కోసం నమోదు చేసుకున్న రోగుల పట్టిక)డాటాలో సెర్చ్ చేస్తారు.
దాతకు సరిసమాన వయస్సు, బ్లడ్గ్రూప్ కలిగిన రోగి ఎవరైన ఉంటే వెంటనే సదరు రోగికి కావల్సిన అవయవాన్ని సేకరిస్తారు. ఈ ప్రక్రియ అవయవాలు పనిచేయకుండా బాధపడుతూ రోగి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులు పూర్తిచేసి, సదరు వైద్యులే సేకరించిన అవయవాన్ని రోగికి మర్పిడి చేస్తారు. అయితే జీవన్దాన్ బ్రెయిన్డెడ్ గురైన వారిని గుర్తించడం, వారికి అవయవ దానం కోసం కౌన్సెలింగ్ ద్వారా ఒప్పించడం, అదే సమయంలో అవసరమైన రోగికి సమాచారాన్ని అందించడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా అవయవాలను సేకరించే ముందు నుంచి సేకరణ పూర్తై దాత మృతదేహాన్ని తరలించే వరకు జీవన్దాన్ బృందం జీవన్మృతుడి కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. ఏదేమైనా అవయవాల సేకరణ, మార్పిడిలో జీవన్దాన్ పాత్ర ఎంతో కీలకమైంది. జీవన్దానలో అవయవ దానం అనేది పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో సాగుతుంది. దీంట్లో ఎలాంటి అవకతవకలు జరిగే ఆస్కారం లేదు.
అవగాహన పెంచి ఎప్పటికప్పుడు పకడ్బందీ నిర్వహణ చేస్తున్నప్పటికీ ఇంకా వేలాది మంది అవయవాలు పని చేయక… అవయవ మార్పిడి శస్త్ర చికిత్స కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు జీవన్దాన్లో తమ పేర్లను నమోదు చేసుకొని.. నిత్యం చికిత్స ద్వారా తమ ఆయుష్షును కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా వీరిలో మూత్రపిండాలు చెడిపోయి బాధపడుతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంది.
అవయవాల మార్పిడి, బ్రెయిన్డెడ్ ధ్రువీకరణకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జీవన్దాన్లో తమ ఆసుపత్రుల పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జీవన్దాన్లో నమోదు చేసుకున్న ఆసుపత్రులకు మాత్రమే సంస్థ ప్రతినిధులు అవయవాల దానం సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు. అయితే తెలంగాణలో 34 దవాఖానలు జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి.
కట్టుబాట్లు, సాంప్రదాయ వ్యవహారాలకు కట్టుబడి ఉండే సౌదీ వంటి దేశాల్లో సైతం అవయవదానాలు జరుగుతున్నాయి. అక్కడివారిలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తుండడంతో కిడ్నీ మార్పిడీలు జరుగుతున్నాయి. యూరోపియన్ దేశాల్లో అవయవ దానంపై ప్రజలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రం అవయవ దానంల్లో మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నదని చెప్పవచ్చు. ప్రారంభ దశలో ఒక్కరితో మొదలైన అవయవ దాతల సంఖ్య నేటి వరకు 386కు చేరుకుంది. నాలుగేళ్ల్ల కాలంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.
జీవన్దాన్ కింద అవయవదానం ద్వారా అనేక మందికి ఆయుష్షు పెంచడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు మించి సేవలందిస్తుంది. ఈ క్రమంలో 2013 నుంచి ఇప్పటివరకు నిమ్స్ ఆస్పత్రిలో 31మంది దాతల ద్వారా (కెడావర్, ఆర్గాన్ కలిపి) ఏకంగా 384 మూత్రపిండ మార్పిడి, 18 కాలేయ, పది గుండె, రెండు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించి అనేక మందికి పునర్జన్మను ఇచ్చారు. అదేవిధంగా ఉస్మానియాలోనూ 77, గాంధీలో 12 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
అమీర్పేట్, డిసెంబర్ 15 : అవయవ దానాలు చేసే వారు ఆదర్శప్రాయులని, అటువంటి అవయవ దానాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. శుక్రవారం సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో జరిగిన అవయవ దాతల సన్మానం, మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు జరిగిన వైట్ కోట్ సెరిమనీలకు గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు 125 మందికి జరిగిన వైట్ కోట్ సెరిమనీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి శ్రీష్ తన ప్రసంగంలో గత రెండేళ్ల కాలంలో సనత్నగర్ ఈఎస్ఐసీలో 10 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.