సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 28న నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీకి చెందిన 43 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్కు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ… యూనివర్సిటీలో మొత్తం 43 మంది విద్యార్థులు బంగారు పతకాలకు ఎంపికయ్యారని తెలిపారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ నుంచి మొత్తం 31,729 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నామని, వారిలో 20,972 మంది యూజీ, 10,757 మంది పీజీలో పట్టాలు అందుకోనున్నట్లు తెలిపారు.
వివిధ జైళ్లలో ఉన్న 148 ఖైదీలకు ఈ సందర్భంగా డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్లో ఉన్న బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న 25వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ చాన్స్లర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. యూనివర్సిటీకి చెందిన కీ నోట్ ప్రజంటేషన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్కుమార్ చేయనున్నారు. అలాగే మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నామని యూనివర్సిటీ వీసీ పేర్కొన్నారు.
అనంతరం యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లి చదువుకోలేని వారికి, గృహిణులు, ఉద్యోగస్తులకు అందుబాటులో ఉండే విధంగా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్ని రకాల కోర్సులు అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవీఎన్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వెంకటరమణ, వివిధ విభాగాలకు చెందిన హెచ్వోడీలు, డీన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.