కొండాపూర్, ఏప్రిల్ 17 : కాలనీలు, బస్తీల సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి బాట పట్టించేలా అధికారులే కాలనీల చెంతకు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధికి ఆటంకాలను గ్రౌండ్ లెవెల్లో గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా కాలనీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. సోమవారం ఆయన చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, పలు విభాగాల అధికారులతో కలిసి వేమనరెడ్డి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాన్ని అందించేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ప్రతి కాలనీ, బస్తీ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారమందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 15 విభాగాల అధికారులు ఒకే తాటిపైకి వచ్చేలా ఈ కార్యక్రమంలో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తిక్, టౌన్ప్లానింగ్ ఏసీపీ సంతప్, ఎస్ శ్రీధర్, డాక్టర్ కీర్తి, ఎస్ఆర్పీ బాలరాజ్, జలమండలి వర్క్ఇన్స్పెక్టర్ కిష్టప్ప, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాధరెడ్డి, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మియాపూర్, ఏప్రిల్ 17 : కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకే వస్తున్నారని కాలనీలో నెలకొన్న సమస్యలను, అవసరాలను వారికి విన్నవించాలని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కోరారు. కాలనీ కాంటాక్ట్లో భాగంగా డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, జేపీనగర్, ఏంఏ నగర్ల ప్రజలు, పలు శాఖల అధికారులతో సోమవారం కార్పొరేటర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, కాలనీవాసులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17: కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని, కాలనీవాసులు దీనిని సద్వినియోగం చేసుకోని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లోని తారానగర్, లింగంపల్లి గ్రామం, హుడా ట్రేడ్ సెంటర్, రైల్విహార్ కాలనీ, రామయ్య కాలనీ, వెంకట్రెడ్డి కాలనీలకు సంబందించి తుల్జాభవానీ దేవాలయం సమీపంలో కాలనీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్ఓ నగేశ్, పారిశుధ్య విభాగ సూపర్వైజర్ జలంధర్ రెడ్డి, ఇంజినీరింగ్ ఏఈ సునీల్, ఎంటమాలజీ విభాగం అధికారి కిరణ్లతో పాటు నాయకులు వీరేశంగౌడ్, హబీబ్బాయ్, కవిత, గోపాలకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్, ఏప్రిల్ 17: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతు ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ హరిజన బస్తీ, సైబర్ హిల్స్ కాలనీతో పాటు హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని స్థానిక కార్పొరేటర్ వి. పూజిత గౌడ్లు సోమవారం దత్త సాయి ఎన్క్లేవ్, ఇంజనీర్స్ ఎన్క్లేవ్, జనప్రియ నగర్ పేజ్ 1,2లో ప్రజలతో ప్రతినిధులు పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సయ్యద్ గౌస్, అర్జున్, రాజు, లక్ష్మణ్, జైపాల్, కృష్ణ, వెంకట్ రామిరెడ్డి, ప్రసాద్, రమేశ్, ఉమా మహేశ్వర్రావు, దేవేందర్రెడ్డి, అశోక్లతో పాటు జీహెచ్ఎంసి అధికారులు డీఈ స్రవంతి, మాదాపూర్ ఏఈ ప్రశాంత్, జలమండలి మేనేజర్ యాదగిరి, మాదాపూర్ ఎస్సై సుఖేందర్రెడ్డి, ట్రాన్స్ కో, శానిటేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.