మహానగరంలో పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ మరింత భరోసా ఇచ్చారు. ఆదివారం ఎన్నికల మ్యానిఫెస్టోలో గ్రేటర్ హైదరాబాద్కు మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రకటించారు. ఇప్పటికే 69వేల ఇండ్లను ఉచితంగా అందజేసిన ప్రభుత్వం..దశల వారీగా అర్హులకు ఇండ్లను పంపిణీ చేయనున్నది. ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యమైనా.. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే డబుల్ ఇండ్ల పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే లక్ష ఇండ్ల నిర్మాణం చేయగా, వచ్చే ప్రభుత్వంలో మరో లక్ష ఇండ్లను నిర్మాణం చేస్తామని హామీనిచ్చారు. ఇండ్లు పొందిన లబ్ధిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, మళ్లీ సీఎం కేసీఆర్ను గెలిపిస్తామని సంతోషంగా చెబుతున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో నిరుపేదలు ఆత్మగౌరవంగా నివసించేలా మొదటి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడతగా మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం చేపడతామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 57 ప్రాంతాల్లో 14,673 ఇండ్ల నిర్మాణం, ఓఆర్ఆర్-జీహెచ్ఎంసీ మధ్య లో 32 ప్రాంతాల్లో 49,991 ఇండ్లు, ఓఆర్ఆర్ అవతల 22 ప్రాంతాల్లో 35,336 ఇండ్లు కలిపి 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.
అత్యాధునిక సౌకర్యాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మగౌరవంతో పేదలు బతికేలా కార్పొరేట్ స్థాయి ఇంటిని ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే 29 బస్తీలలో పేదల పాత గృహాలను తొలగించి కొత్త గృహాలను నిర్మించగా..5,660 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక మిగిలిన వారిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ అవతల నిర్మించిన డబుల్ బెడ్రూం నిర్మాణ ప్రాజెక్టులలో అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటి వరకు 69వేల మందికి రెండు పడకల ఇండ్లను పంపిణీ చేయగా…ఎన్నికల కోడ్ సందర్భంగా మిగిలిన 31వేల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం కొనసాగుతుందని, అదనంగా మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రేటర్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, వాటిలో డబుల్ బెడ్ర్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ దశల వారీగా ఉంటుందని, అర్హులైన వారందరికీ ఇండ్లను అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకున్న లబ్ధిదారులంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడంతో పాటు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు.