హైదరాబాద్, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ): “చిత్తశుద్ధితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం” అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే ఇఫ్తార్ను ఎల్బీ స్టేడియంలో బుధవారం నిర్వహించగా, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గువ్వల బాలరాజు, బేతి సుభాష్రెడ్డి, కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎం సెక్రటరీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్కు దాదాపు 12వేల మందికి పైగా ముస్లింలు హాజరయ్యారు.