జూబ్లీహిల్స్ : కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన ‘మే డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్మికులకు ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తుందని, కళ్యాణలక్ష్మి పథకంతో రూ.1 లక్ష 116 లతో పాటు అదనంగా రూ.30 వేలు కార్మికశాఖ అందిస్తుందని అన్నారు.
కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని.. ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షుడు అహ్మద్, యాదగిరి, బంగారి తదితరులు పాల్గొన్నారు.