మహేశ్వరం, ఆగస్టు 17: రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మహేశ్వరంలో రూ.4 కోట్లతో 30 పడకల దవాఖాన, ఆక్సీజన్ ప్లాంటును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంబించారు. అనంతరం గండికోట ప్రాంగణం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపు చెందుతున్నదని అన్నారు. ఒకప్పుడు ఎర్ర గోళి మందు బిల్ల దొరుకని రోజుల్లో నాడు రాష్ట్రంలో 17 వేల పడకలు ఉంటె, నేడు 50 వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నేడు తెలంగాణ సర్కారు దవాఖానలో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని అన్నారు. కృషి పట్టుదల ఉన్న నాయకురాలు మహేశ్వరం నియోజక వర్గంలో ఉండబట్టే నేడు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎల్లవేళలా ప్రజలల్లో ఉండే నాయకురాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో విద్యాశాఖను అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో త్వరలోనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు. మహేశ్వరం దినాదినాభివృద్ధి చెందుతున్నదని అన్నారు. అందుకు అనుగుణంగా ఐటీ మంత్రి కేటీఆర్తో చర్చించి మహేశ్వరం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో త్వరలోనే ఒక ఐటీ హాబ్ను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. మహేశ్వరంలో ఐటీ హాబ్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది కి ఉపాధి అవకాశాలతో ప్రాంతాభివృద్ధి జరుగుతున్నదన్నారు.
తెలంగాణ మోడల్ను చూస్తున్న దేశం
దేశం తెలంగాణ మోడల్ను చూస్తున్నదని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలు సంక్షేమ రంగాలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మన తెలంగా ణ పథకాలను కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ మోజన పేరుతో ముందు కు పోతున్నదన్నారు. మిషన్ భగీరథ పేరుతో కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టి ‘హర్ ఘర్కో జల్’ పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఆచరిస్తే నేడు దేశం అనుసరిస్తుంది అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదని అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని ఇతర పార్టీల నాయకులు మాట్లాడి రైతుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆయన ప్రతి పక్ష పార్టీలపై మండి పడ్డారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ నే అన్ని ఆయన అన్నారు. రాష్ట్రంలో 3 గంటలు చాలంటె కాంగ్రెస్కు ఓటు వేయాలని, 24 గంటలు కావాలంటె బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆయన అన్నారు.
తెలంగాణలో ఉన్న రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం అంటున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దానిని ప్రశ్నించినందుకే రాష్ర్టానికి రావాల్సిన 35 వేల కోట్లు ఆపేశారని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఆహర్నిషలు కృషి చేస్తుంటే.., బీజేపీ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో దీపం లాగా వెలుగును ఇస్తున్న కేసీఆర్ కావాలా, పాపం లాం టి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కావాల్నా? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత కరెంటు మీద 60 వేల కోట్లు, 72 వేల కోట్లు రైతుబంధుకు, 5500 కోట్లు రైతు బీమాకు, రూ.36 వేల కోట్లు రుణమాఫీకి ఇవ్వడం జరిగినదని అన్నారు. గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, తండాలను పంచాయతీలుగా మార్చి వారిని స్వయం పాలకులుగా చేశారని ఆయన గుర్తు చేశారు. రూ.200 ఉన్న పింఛన్ను 2 వేలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
సర్కారులో పెరిగిన ప్రసవాల సంఖ్య
సర్కారు దవాఖానలో ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని అన్నారు. కేసీఆర్ కిట్టు, షాదీ ముభారక్, కళ్యాణ లక్ష్మి తో ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నామని ఆయన పేర్కొన్నా రు. మహేశ్వరం దవాఖానకు ఆల్ట్రాస్కాన్ మిషన్ను త్వరలోనే అందజేస్తామని అన్నారు. ఒకపుడు.. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని అన్నారని ఆయన అన్నారు. నేడు పోదాం పద సర్కారు దవాఖానకు అనే విధంగా రోగుల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 95 వేల మందికి అభయ హస్తం డబ్బులను త్వరలో మిత్తితో సహ చెల్లిస్తామన్నారు. కార్యక్రమలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ స్పీకర్ ఎంఎల్సీ మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పి.కార్తిక్రెడ్డి, సునీతా ఆంధ్యా నాయక్, పాండు యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, అంగోతు రాజు నాయక్, యాదగిరి గౌడ్, కూన యాదయ్య పాల్గొన్నారు.
రైతులంతా ఆనందంతోనే..
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు అనందంతోనే ఉన్నారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా గాని తెలంగాణ ముందుకు సాగుతుంది. మహేశ్వరం నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని మంత్రి హరీశ్ రావు చొరవతోని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అమీర్పేట్, మన్సాన్పల్లి గ్రామాలలో పీహెచ్సీలను ఏర్పాటు చేస్తె ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నాము. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు వెన్ను దన్నుగా నిలబడాలి.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారుతుంది. తెలంగాణలో విద్య, వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రైవేటు దవాఖానలో ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానాలల్లో సీజేరియన్ లేకుండానే ఎక్కువ శాతం ప్రసవాలను జరుపడం జరుగుతుంది. గర్భిణులకు అందిస్తున్న కేసీఆర్ కిట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మంత్రి హరీశ్రావు నాయకత్వలో తెలంగాణలోని ప్రతి ఇంటికి తిరిగి బీపీ, షుగర్ మందులను అందజేస్తున్నారు.
– డా॥ తీగల అనితా హరినాథ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్