ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14: ఓయూ సాహిత్య వేదిక ప్రపంచ వ్యాప్తం కావాలని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న ఆకాంక్షించారు. తెలుగు భాష, సాహిత్యాలను సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు. ఓయూ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కవితా దుందుభి ఆరో వార్షికోత్సవ సభను ఓయూ ఆర్ట్స్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోరటి వెంకన్న, ప్రముఖ కవి నందినీ సిధారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావాలను వ్యక్తం చేసేందుకు వచన కవిత చాలా అనువైన ప్రక్రియ అని అన్నారు. మనసును కదిలించే శక్తి వచన కవిత్వానికి ఉందని చెప్పారు.
హృదయానికి హత్తుకునేలా వచనం రాసే ప్రతి ఒక్కరు కవే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతామణి పద్యాలను ప్రముఖ గాయకుడు అక్కిరాజు రామకృష్ణారావు హృద్యంగా ఆలపించారు. చింతల యామిని, రాచకొండ రమేశ్, తులసి గారి నరసింహ, శివరాత్రి సుధాకర్, రేలారే గంగ, సుక్క రామనర్సయ్య, పాటమ్మ రాంబాబు, మీసాల లక్ష్మణ్, చంద్రయ్య, ఉదయభాను, తలారి ఢాకన్న, తగుళ్ల గోపాల్, పేర్ల రాము, శరణ్య తమ తమ ప్రక్రియలలో కవిత్వాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్, సాహిత్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.