సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సురవరం ప్రతాపరెడ్డి నుంచి మొదలుకొని ఇప్పటికీ, ఎప్పటికీ తీసిపోని రచనలు తెలంగాణ సొంతమని హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఆమె పేర్కొన్నారు. ప్రముఖ కవి గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ సంకలనంపై అలిశెట్టి ప్రభాకర్ వేదికపై చర్చా గోష్ఠి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన అనేక మంది గొప్ప కవులు ఉన్న వారసత్వాన్ని గోరటి వెంకన్న మోసుకొస్తున్నారని అన్నారు. మట్టి తత్వాన్ని అణువణువునా పుణికిపుచ్చుకొని ఆయన రచన కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సంభాషణ ఇట్లా జరిగింది.
ఎమ్మెల్సీ కవిత: బాల్య స్మృతులను అద్భుతంగా ఎట్లా రాయగలిగారు?
గోరటి : చుట్టూ ఉన్న ఆకుపచ్చని అడవిలో జామ, శిమిటి, నక్కెర పండ్లు లాంటి అనేక కాయలు, పండ్లు బాల్యానికి ఎంతో తీపి గుర్తుగా నిలిచాయి. ఇది తెలంగాణలో ప్రతిపల్లెలో ఇమిడి ఉండే అంశాలే.
ఎమ్మెల్సీ కవిత : కొత్తగా రాయాలనుకొనే వాళ్లకు మీరిచ్చే సూచనలు?
గోరటి : నింగి నీటి మబ్బువోలె, పొంగే ఏటి వోలె.. బరువులనెదిరించుకొని కవిత్వం రాయాలంటే ఊరికే వచ్చేది కాదు. బాధను, సంతోషాన్ని, సమాజంలో ఉన్న అసమానతలను ఆకళింపు చేసుకొని సమాలోచన చేసి రాయగలరు. కోపం, ప్రేమ, ఇష్టం లాంటి అంశాల్లోంచి పుట్టేదే కవిత్వం. అప్పుడే సృజనాత్మకత
పుడుతుంది.
ఎమ్మెల్సీ కవిత : మీరు రాసే శైలి, గేయ సాహిత్యాన్ని ఎట్లా ఎన్నుకున్నారు?
గోరటి: సాహిత్యంలో రచయితలు ఎట్లా ఆలోచన వస్తే అట్లా రాయాల్సిందే. అదే వారిని నిలబెడుతుంది. 1970-1980 దశకంలో గద్దర్ పాట ఉప్పెనలా ఉప్పొంగింది. ఆ ప్రభావం ఎంతో ఉంది. అందుకే అటు వైపు మళ్లాను.
ఎమ్మెల్సీ కవిత : సమాజంలోని విద్వేషాలను, అసమానతలను ఎదుర్కొనాలంటే?
గోరేటి : దేశభక్తి పేరుతో కార్పొరేటర్ శక్తులు మనుషులను మనుషులుగా చూడని పరిస్థితి వచ్చింది. సాటివారిపై మనుషులను ఉసిగొల్పే సమయంలో ఉత్తమోత్తమ విలువలను కొనసాగించి ఉన్మాదాన్ని సృష్టించే వ్యవస్థను అడ్డుకోవాలంటే, భారతీయతను కాపాడుకోవాలంటే కవి, కళాకారులు తమ గళాన్ని వినిపించాల్సిందే. కలాన్ని కదిలించాల్సిందే.
జూలూరు : మీరు ఓ సంచార కవిగా పేరుగాంచారు. ఎట్లా ?
గోరటి : ప్రపంచంలోని ప్రతి జీవి సంచార జీవితాన్ని కొనసాగిస్తుంది. గ్రామాల్లో పశువుల వెంట వెళ్లేవారు సంచారులే. ఊరి నుంచి పట్నం వెళ్లేవారు సంచారులే. ఇట్లా సంచారం వల్ల మనిషికి జ్ఞానం పోగై సమున్నతంగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది.
కొండా : అద్భుతమైన భావుకతను రాయడానికి ప్రేరణ ఏమిటి?
గోరేటి : మా నాయిన నుంచి అబ్బిన అంశం ఇది. ద్వేషం సాహిత్య లక్షణం కాదు. కేశవరెడ్డి, రావిశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, కృష్ణశాస్త్రి, గద్దరన్న జీవన చిత్రణ లాంటి అనేక అంశాలు నాకు ప్రేరణగా నిలిచాయి.
పుస్తక ప్రదర్శనలో కలియతిరిగి..
35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్సీ కవిత కలియదిరిగారు. తెలంగాణ జాగృతి స్టాల్ను సందర్శించారు. వివిధ స్టాల్స్ను ఆమె ఆసక్తిగా తిలకించారు. పిల్లల పుస్తకాలు, సాహిత్యం, కథల పుస్తకాలను కొనుగొలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో కవులు, కళకారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా ఖ్యాతి పొందిన తెలుగుకు..మళ్లీ అంతటి ఖ్యాతిని వెంకన్న మోసుకొస్తున్నారని కొనియాడారు. ఈ మట్టి, శ్రమతత్వాన్ని అణువణువునా గోరటి వెంకన్న తన రచనలో పొందుపరిచారని చెప్పారు.