సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఆదివారం అందులోకి అడుగు పెట్టనున్న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొలి సంతకం పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన ఫైలుపైనే చేయనున్నారు. గూడులేని నిరుపేద ఈ మహా నగరంలో చిల్లిగవ్వ చెల్లించకుండానే సుమారు రూ.40-50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇంటి యజమానిని చేసేందుకుగాను పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేసి, జారీ చేయనున్నారు. దీంతో ఇప్పటికే అధికార యంత్రాంగం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చాలా మేరకు నిర్వహించినందున చకాచకా ఇళ్ల పంపిణీ అనేది ముందుకుపోనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం లక్ష యూనిట్లను మంజూరు చేసింది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నది. ఈ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో ప్రైవేటు డబుల్ బెడ్రూం ఇళ్లు కొనుగోలు చేయాలంటే కనీసంగా రూ.40-50 లక్షల భారం మోయక తప్పదు. అలాంటిది ఉచితంగానే ప్రభుత్వం ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని బస్తీ ప్రదేశాల్లో నిర్మించిన 4,500 ఇళ్లను ఆయా బస్తీలకు చెందిన నిరుపేదలకు పంపిణీ చేశారు. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లోని ఏకంగా 65వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తవడంతో వాటి పంపిణీకి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికార యంత్రాంగం దరఖాస్తుల పరిశీలన దాదాపుగా పూర్తి చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 30వేల మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేసినట్లు తెలిసింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీకి సిద్ధమవడంతో ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాల రూపకల్పనను కూడా పూర్తి చేసింది. ఆదివారం చారిత్రక తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. మంత్రులు తమకు కేటాయించిన కార్యాలయాల్లోకి ప్రవేశించి, విధులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ మూడో అంతస్తులో తనకు కేటాయించిన కార్యాలయంలోకి ప్రవేశించిన వెంటనే తొలి సంతకాన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై చేయనుండటం శుభ పరిణామం. ఈ మార్గదర్శకాల ఆధారంగానే గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ విధానమనేది కొనసాగనున్నది.