TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్ను రూ.80 కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన టీ-24 టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టీ-24 టికెట్ మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తెచ్చిన టీ-24 టికెట్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. టీ-24 టికెట్ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయన్నారు. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత దగ్గర చేసేందుకు టీ-24 టికెట్ను రూ. 80కే విక్రయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-6 టికెట్ను ఇటీవల ప్రారంభించామని తెలిపారు. రూ.50కి ఆ టికెట్ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించే అవకాశం కల్పించారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వీకెండ్స్ సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.