సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరులకు మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న వార్డు పాలన అమలుకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 10వ తేదీన వార్డు కార్యాలయాలను ప్రారంభించి ఇంటి ముగింటకే పౌర సేవలను అందించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ సుపరిపాలన దినోత్సవం పేరిట జరిగే కార్యక్రమంలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
గత నెల మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ నగరంలో సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా జీహెచ్ఎంసీ వార్డు పాలన వ్యవస్థకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే వార్డు పాలన వ్యవస్థతో ప్రజలు సర్కిల్, జోనల్ కార్యాలయాలకు వెళ్లకుండా చేరువలో ఉండే వార్డు పరిధిలోనే ఫిర్యాదులు, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వానికి వేగంగా ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం కలగడంతో పాటు వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా 150 వార్డులలో 10మంది ప్రత్యేక అధికారులను ఇప్పటికే నియమించారు. ఆహ్లాదకర వాతావరణంలో, సకల సదుపాయాలతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.