సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ
ఖైరతాబాద్, జూలై 3: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని సేవా కేంద్రంలో స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ 1975లో ప్రారంభమైన వాసవీ సేవా కేంద్రం నేటికి 50 ఏండ్లు పూర్తిచేసుకుని ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలతో సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహించి స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ఆదర్శంగా నిలువాలని, బంగారు తెలంగాణ రాష్ట్రానికి పునాదులు వేయడానికి కృషి చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారంతో తమ వాసవీ సేవాకేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యులకు అన్ని రంగాల్లో విశిష్ట స్థానం కల్పించారని పేర్కొన్నారు. అనంతరం అతిథులు విద్య సహాయ నిధి ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి చదువుకొనే విద్యార్థులకు ఉపకార వేతనం, సూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్తో కూడిన కిట్ బ్యాగ్లు పంపిణీ చేశారు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే పది మంది వృద్ధులకు జీవన భృతి, ఇంటర్లో చక్కని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపకార వేతనం అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు ఆలంపల్లి రవి కుమార్, ప్రధాన కార్యదర్శి కొల్పూరు రమేశ్, కోశాధికారి పాంపటి జ్ఞానచందర్, సలహాదారులు చికట్మర్ల అశోక్ కుమార్, కొండ్లె మల్లికార్జున్, కె.రాజశేఖర్ పాల్గొన్నారు.