జూబ్లీహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉందని, పిల్లలపై బలవంతంగా చదువుల భారం వేస్తున్న తల్లిదండ్రులు వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకురావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పిలుపునిచ్చారు. పిల్లల్లో మానసికోల్లాసం కలిగించేలా వారికి ఇష్టమైన క్రీడలలో శిక్షణ ఇప్పించాన్నారు.
తద్వారా కరాటే, కుంగ్ఫూ వంటి ఆత్మరక్షణ క్రీడలతో వారు సమస్యలను సైతం సునాయాసంగా ఎదుర్కోగలరని పేర్కొన్నారు. ఆదివారం యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో రుద్రమదేవి షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సీఎం కేసీఆర్ కప్-2022’ పోటీల విజేతలకు నిర్వాహకులు వి.రవి, ఎన్.లక్ష్మిలతో కలిసి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ పిల్లల్లో ప్రతిభను వెలికితీసేందుకు వేదికలు ఎంతో అవసరమని, అలాంటి వేదికలు ఏర్పాటుచేసే వారికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఫిబ్రవరి 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని 13 రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది క్రీడాకారులతో ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, ఆయా పోటీలు క్రీడాస్ఫూర్తిని నింపడమే కాక వందలాది క్రీడాతేజాలను వెలుగులోకి తెస్తాయన్నారు.
తొలుత ఈ పోటీలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవిలు శాట్స్ ఛైర్మెన్ వల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, అసోసియేషన్ ఎపి-తెలంగాణల చైర్మెన్ చందు శ్రీనివాస్, జాతీయ రెఫరీలు, న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు.