ఈ నెల 30 నుంచి గోల్కొండ ఆషాఢం బోనాలు
పండుగకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట
పట్టువస్ర్తాలు సమర్పించనున్న మంత్రులు
జాతరకు భారీగా ఏర్పాట్లు..
ప్రభుత్వం నుంచి పట్టువస్ర్తాల సమర్పణ
9 వారాల పాటు గోల్కొండ బోనాలు
తొలి బోనం జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికే..
భాగ్యనగరమంటేనే మతసామరస్యానికి ప్రతీక. ఇక్కడ జరిగే ప్రతీ వేడుక ఘనమే. చారిత్రక నగర వైభవాన్ని చాటే ఆషాఢ బోనాలు ప్రజల ఐకమత్యాన్ని చాటుతాయి. అన్నివర్గాల వారు ఆనందంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. కోటలో కొలువుదీరిన ఎల్లమ్మ ఆలయాన్ని ముస్తాబు చేస్తుండగా, బోనాల తొలిరోజు ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలతో కోట ప్రాంగణం కిటకిటలాడనుంది. కరోనాతో రెండేండ్లు బోసిపోయిన ఉత్సవాలకు ఈ ఏడాది లక్షలాది మంది తరలిరానున్నారు.
మెహిదీపట్నం జూన్ 25 : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ఈ నెల 30న ప్రారంభంకానున్నది. ఆషాఢమాసం బోనాలకు చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం రోజున అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 30 నుంచి తొమ్మిది వారాల (గురు,ఆదివారాలు)పాటు ఈ ఆషాఢ మాసం బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల గోల్కొండ కోటలో ప్రభుత్వ శాఖల అధికారులు, బోనాల నిర్వహణ కమిటీ, మైత్రి, పీస్ కమిటీలతో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు గోల్కొండ బోనాల నిర్వహణకు సంబంధించిన పలు మార్గదర్శకాలను జారీ చేశారు. కరోనా అనంతరం పూర్తి స్థాయిలో గోల్కొండ బోనాల జాతర జరుగుతుండటంతో రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తామని జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్ తెలిపారు.
నెల రోజుల పాటు గోల్కొండ బోనాలు..
తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు నగరంలో నెల రోజుల పాటు జరగనున్నాయి. చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 28వరకు ఆషాఢ మాసం బోనాలు జరుగుతాయి. మొత్తం తొమ్మిది పూజలు ఉండగా, ఆరో పూజ రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఎనిమిదో పూజ రోజున హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. ఈ బోనాలలో పాల్గొనడానికి నగర వ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు గోల్కొండ కోట తరలి వస్తారు.
ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు..
ఆషాఢమాసం బోనాలను తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బోనాలను ప్రారంభించే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు అందచేయడం ఆనవాయితీ. జూన్ 30న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్లు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. ఆషాఢమాసం బోనాలు ప్రారంభం అయ్యాక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ట్రస్టు తరపున సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్దర్వాజ, కార్వాన్ దర్బార్ మైసమ్మ, లంగర్హౌస్ బుజిలి మహంకాళి ఆలయం, షేక్పేట్ మహంకాళి ఆలయం, సబ్జిమండి నల్లపోచమ్మ ఆలయాలకు పట్టువస్ర్తాల సమర్పణ ఉంటుంది.
తొట్టెల ఊరేగింపు..
గోల్కొండ బోనాల ప్రారంభం రోజున తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గురువారం ప్రారంభం అయ్యే బోనాల పండుగకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొట్టెలను తెచ్చి కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో సమర్పిస్తారు. దీనికి తోడు పోతురాజుల విన్యాసాలు బోనాల జాతరలో హైలెట్గా నిలుస్తాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శనలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. లంగర్హౌస్ చౌరస్తాలో మంత్రులు పట్టువస్ర్తాలు సమర్పించిన తర్వాత గోల్కొండలో పూజారి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలను తొట్టెలతోపాటు కోటపై వరకు ఊరేగించి ఆలయంలో ప్రతిష్టిస్తారు.
30న కుమ్మరుల బోనాల జాతర
ఖైరతాబాద్, జూన్ 25 : కుమ్మరుల సామాజిక, సాంస్కృతిక వైభవాన్ని చాటే బోనాల జాతరను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత్ రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30న లోయర్ ట్యాంక్బండ్ వద్ద నున్న జగదీశ్ మందిర్ నుంచి కట్టమైసమ్మ గుడి వరకు 516 బోనాలతో మహిళలు శోభాయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మరుల బోనాల జాతరకు రూ.5లక్షల మంజూరు చేస్తున్నారని తెలిపారు. అలాగే కుమ్మర్ల సంక్షేమానికి ఇప్పటి వరకు 210 మందికి కులవృత్తిని నిర్వహించుకునేందుకు రూ.1లక్ష చొప్పున మంజూరు చేశారన్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మైనంపల్లి హన్మంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, టీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కుమ్మర శాలివాహన ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాలాచారి, కార్పొరేటర్లు రచనశ్రీ, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరుకానున్నారు.
బోనాల పండుగకు తప్పకరండి
చారిత్రక గోల్కొండ ఆషాఢమాసం బోనాలకు హాజరుకావాలని శనివారం ఎమ్మెల్సీ ఎల్.రమణ, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలకు ఆహ్వాన పత్రికలను అందిస్తున్న గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్, మాజీ ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్, నాయకులు సత్యనారాయణ, కార్తీక, చిరు, శ్రీనివాస్, మోహన్దాస్ తదితరులు.
బోనాలను వైభవంగా నిర్వహిస్తాం..
ఈ ఏడాది బోనాలను గోల్కొండ కోటలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి శాయశక్తులా కృషి చేస్తాం. తొమ్మిది వారాల పాటు జరిగే బోనాలను చేసుకోవడానికి గోల్కొండ కోట వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వ సహకారంతో అన్నీ ఏర్పాట్లు చేపడుతున్నాం. – వావిలాల మహేశ్వర్, ఆలయ ట్రస్టు చైర్మన్