సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విక్రయించేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న తయారీదారుడితో పాటు ముగ్గురిని సెంట్రల్ టాస్క్ఫోర్స్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మిపెర్మాల్ కథనం ప్రకారం.. గుజరాత్కు చెందిన రహీమ్ ఛారనియ హైదరాబాద్కు జీవనోపాధి కోసం వచ్చి బేగంపేటలో ఉంటున్నాడు. డెక్కన్ ట్రేడర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా సులువుగా డబ్బు సంపాదించేందుకు రాజేంద్రనగర్, ఉప్పర్పల్లిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. వివిధ రకాల రసాయనాల రంగులు, ఆమ్లాలను ఉపయోగించి నకిలీ అల్లం, వెల్లుల్లి పెస్ట్ను తయారు చేస్తున్నాడు. ఈ నకిలీ పేస్ట్ను కిరాణా, జనరల్ స్టోర్లు, వివిధ దుకాణాల ద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విక్రయిస్తున్నాడు.
ఇందుకు బేగంపేటకు చెందిన పాండురంగారావు, బేగంబజార్కు చెందిన తెలంగాణ ఏజెన్సీ ప్రొపరేటర్ అజయ్కుమార్ అహీర్, పంజాగుట్టకు చెందిన నికిల్ ట్రేడర్స్ ప్రొపరేటర్ ప్రదీప్ సంకాలలను డిస్ట్రిబ్యూటర్లుగా నియమించుకున్నాడు. ఇలా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల్లోనూ ఈ నకిలీ అల్లం, వెల్లుల్లిని విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బేగంపేట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రహీం, పాండురంగారావు, అజయ్కుమార్, ప్రదీప్లను అరెస్ట్ చేశారు. రూ. 5 లక్షల విలువైన నకిలీ పేస్ట్ను, ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ అల్లం, వెల్లుల్లిలో మురిగిపోయిన వస్తువులను కూడా వాడుతున్నట్లు వెల్లడైంది. 20 కిలోల కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.