సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస్సేన్, పండాల సతీశ్ బాబు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 15 స్థానాలకు గాను 19 మంది కార్పొరేటర్లు నామినేషన్లు సమర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను మరుసటి రోజున పరిశీలించి అర్హుల పేర్లను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుందని, పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 19వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన వారు.!
శాంతి సాయిజెన్ శేఖర్, వనం సంగీతా యాదవ్, బండారి రాజ్కుమార్, మహేశ్వరి, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, ఈఎస్ రాజ్జితేంద్రనాథ్, ఆర్.సునీత, రాగం నాగేందర్యాదవ్, బానోతు సుజాత, ఉప్పలపాటి శ్రీకాంత్, పండాల సతీశ్ బాబు, పడావు అర్చన, టి.మహేశ్వరి, అబ్దుల్ వాహేద్, సయ్యద్ సోహేల్ ఖాద్రీ, మహమూద్ అబ్దుల్ ముక్తదార్, సయ్యద్ మినిహాజుద్దీన్, సమీరా బేగం, మహమూద్ మజీద్ హుస్సేన్లు ఉన్నారు. కాగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి 12 మంది ఉండగా, ఎంఐఎం నుంచి ఏడుగురు నామినేషన్ దాఖలు చేశారు.