సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తున్నది. ఈ మేరకు ఎన్నిక షెడ్యూల్ తేదీలను మంగళవారం ప్రకటించారు. బుధవారం నోటిఫికేషన్ జారీ చేస్తుండగా, నవంబరు 2 నుంచి 10 వరకు రోజూ ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ (సెలవు రోజులైన 6, 8వ తేదీలు మినహా) జరగనున్నది. ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. 11న మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను మరుసటి రోజున పరిశీలించి అర్హుల పేర్లను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుందని, పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 19వ తేదిన జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక పక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని పేర్కొన్నారు. కార్పొరేటర్లు మాత్రమే పోటీలో నిలిచేందుకు అర్హులని తెలిపారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యులు వీరే..
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి పన్నాల దేవేందర్ రెడ్డి (మల్లాపూర్), సీఎన్ రెడ్డి (రహ్మత్నగర్), సామల హేమ (సీతాఫల్మండి), మందడి శ్రీనివాస రావు (కేపీహెచ్బీ కాలనీ), కె. హేమలత (బన్సీలాల్పేట), ఇ. విజయ్కుమార్ గౌడ్ (అంబర్పేట), రావుల శేషగిరి (గాజుల రామారం), వై. ప్రేమ్ కుమార్ (ఈస్ట్ ఆనంద్బాగ్) ఎంఐఎం పార్టీ నుంచి మహమూద్ అబ్దుల్ సలాం షాహీద్ (చావని), పర్వీన్ సుల్తానా (ఝాన్సీ బజార్), మందగిరి స్వామి (కార్వాన్), మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ (షేక్పేట), బాతాజబీన్ (విజయ్ నగర్ కాలనీ), మహపర (కుర్మగూడ), మీర్జా ముస్తాఫా బేగ్ (రియాసత్ నగర్)లు కొనసాగుతున్నారు.