సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వరద నీటి ముంపు నివారణకు రూ.250కోట్లు మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వరద నీటి ముంపునకు శాశ్వత పరిష్కారంగా ఎస్ఎన్డీపీ పథకానికి శ్రీకారం చుట్టి, తొలి విడతలో దాదాపు రూ.850కోట్లను ప్రభుత్వమే స్వయంగా వెచ్చించి నాలా అభివృద్ధి పనులు జరుపుతున్నామని, నేషనల్ అర్బన్ ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రాంలో నిధులు మంజూరు చేయాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆథారిటీ (ఎన్డీఎంఏ)కి ప్రతిపాదనలు సమర్పించింది. 50 లక్షల జనాభా మించి ఉన్న ఏడు నగరాలను నేషనల్ అర్బన్ ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రాం కింద కేంద్రం ఎంపిక చేయగా.. హైదరాబాద్ నగరానికి నిధులు మంజూరు చేయాలంటూ జీహెచ్ఎంసీ కోరింది. రూ.200 కోట్లతో నాలా నిర్మాణ పనులు, రూ.50 కోట్లతో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలకుగాను అత్యాధునిక టెక్నాలజీ సాయం వినియోగించేందుకు ఖర్చు చేయనున్నామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. కాగా ఏటా రూ.50కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.250కోట్ల నిధులను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆథారిటీ (ఎన్డీఎంఏ) కేటాయించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.