Annapurna Canteen | సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘అన్నపూర్ణకు తాళం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన ప్రత్యేక కథనానికి అధికారులు స్పందించారు.
మూసాపేట గూడ్స్ సమీపంలోకి అన్నపూర్ణ సెంటర్ను ట్రాఫిక్, రవాణా వాహనాల దృష్ట్యా గతేడాది ఏప్రిల్లో నిలిపివేశామని, తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో పనిచేయని అన్నపూర్ణ కేంద్రాలపై సాధ్యాసాధ్యాల పరిశీలన జరుగుతుందన్నారు. అన్నపూర్ణ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.