విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో పౌరసేవలు మరింత మెరుగుకానున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని.. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గ్రేటర్వ్యాప్తంగా ఆరు జోన్ల పరిధిలో 5వేలకు పైగా బృందాలను ఏర్పాటు చేస్తూ.. బల్దియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి ఈ బృందాలు కాలనీల్లో తిరుగుతూ.. సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో పౌర సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు నాణ్యమైన సేవలను అందించాలని నిర్ణయించారు. ప్రధానంగా ప్రజాప్రతినిధుల వద్దకు రానీ సమస్యలు కింది స్థాయిలో అనేకం ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, వైద్య ఆరో గ్య శాఖల అధికారులందరూ ఒక్క తాటిపైకి చేరుకొని..ఆయా శాఖల క్షేత్రస్థాయి అధికారుల సమన్వయంతో ‘ మల్టీ డిసిప్లీనరీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
గ్రేటర్వ్యాప్తంగా భగిధారి కార్యక్రమం పేరుతో 5వేలకు పైగా బృందాలను ఏర్పాటు చేస్తూ బల్దియా నిర్ణయం తీసుకుంది. 10వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ కింద స్థాయిలో పనిచేసే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్, బీట్ కానిస్టేబుల్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఇతర అధికారుల పేర్లు, హోదా, ఫోన్ నంబర్ల వివరాలతో రోజు వారీగా కార్యక్రమాలను చేపట్టనున్నాయి. గార్బెజ్ పాయింట్, గ్రీన్ వేస్ట్, కాలనీ ప్లాంటేషన్/వాటరింగ్, పబ్లిక్ టాయిలెట్లు, నాలా సెఫ్టీ, క్యాచ్పిట్ సమస్యలు తదితర వాటిపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి.