సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): చెరువులను కబ్జా చేస్తే కటకటాలు లెక్కించాల్సిందే. చెరువుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారణ, చెరువు భౌగోళిక స్వరూపం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ప్రాంతం, రెవెన్యూ మండలం వివరాలపై సమగ్ర స్థాయిలో సర్వే చేస్తున్నారు. కబ్జాలకు ఆస్కారం లేకుండా చెరువుల చుట్టూ ఫెన్సింగ్, పకడ్బందీ వివరాలతో చెరువు మ్యాపులను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో జీహెచ్ఎంసీకి సంబంధించి 185 చెరువులను పరిరక్షించి, పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలతో కలిసి ఫైనల్ నోటిఫైడ్ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ వెబ్సైట్లో చెరువు వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఎఫ్టీఎల్ హద్దు మ్యాప్ల అంతిమ నోటిఫికేషన్ను జారీ చేయడానికి గానూ హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా నియమించుకొని జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. చెరువుల సంరక్షణ కమిటీ వెబ్సైట్లో 157 చెరువులకై ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేయగా 28 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఆక్రమణల తొలగింపు..
ఎఫ్టీఎల్ పరిధిలో 8718 అక్రమ నిర్మాణాలు , బఫర్ జోన్లో 5353 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. 51 చెరువులలో ఆక్రమణలు లేవని స్పష్టం చేశారు. 30 చెరువుల్లో 85 శాతం ఆక్రమణలు ఉండగా, 104 చెరువుల్లో 15శాతం ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. ఎఫ్టీఎల్/బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఉన్న ఆక్రమణలను తొలగించి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.94.17 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 63 చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయగా, చెరువు హద్దు, సంరక్షణ పనులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో 280 కేసులు పెండింగ్లో ఉండగా , వివాదాలు ఎత్తివేయగానే సంరక్షణ చర్యలు చేపడుతామని అధికారులు పేర్కొన్నారు. కాగా రూ. 167కోట్లతో చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. మురుగునీటి మళ్లింపు, వీర్స్, స్లుయిసెస్ బండ్ బలోపేతం, కంచె వేయడం ఇలా 161 పనులను చేపట్టారు. వీటితో పాటు సీఎస్ఆర్ కింద 11 చెరువులను అభివృద్ధి చేశారు.