పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులతో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా హోటళ్లపై తరచూ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మ, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పరిశీలన
చెత్తరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సంజీవయ్య పార్కు సమీపంలోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మేయర్ పరిశీలించారు. నగరంలో 21 ఆధునిక గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయని, మరో తొమ్మిది నిర్మాణ దశలో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు మేయర్కు వివరించారు. బంజారాహిల్స్ ప్రాంతంలోనూ మరో ఆధునిక గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.