సిటీబ్యూరో, మే 25, (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనేలా సరికొత్త కార్యాచరణ ప్రణాళికకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వాతావరణ శాఖ సమన్వయంతో జోన్ల వారీగా ఉండే వాతావరణ సమాచారాన్ని డివిజన్ల వారీగా 150 వార్డుల్లో అందజేయనున్నది. రాడార్ వ్యవస్థలో గ్రేటర్లోని 150 డివిజన్ల పటాలను చేర్చారు. తద్వారా వాతావరణ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, అందుకు అనుగుణంగా సహాయక చర్యలను వేగిరం చేస్తున్నట్లు ఈవీడీఎం అధికారులు తెలిపారు. ప్రస్తుతం బేగంపేట వాతావరణ శాఖ నుంచి మూడు విధాలుగా వాతావరణం సమచారం అందుతోంది.
250 కిలోమీటర్ల దూరాన్ని అంచనా వేసే రాడార్ ద్వారా రాష్ట్రం మొత్తానికి జిల్లాల వారీగా సమాచారం చేర్చుతున్నారు. రెండో విధానం వంద కిలోమీటర్ల పరిధి, మూడో విధానం 25 కిలోమీటర్ల మేర పరిధికి సమాచారం చేర్చుతున్నారు. 25 కిలోమీటర్ల మేర దూరాన్ని పరిశీలించే రాడార్ ద్వారా ఇప్పటివరకు ఆరు జోన్లు కూకట్పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్లతో పాటు మేడ్చల్ జిల్లాలో కొంత భాగం, షాద్నగర్ చుట్టు పక్కల ప్రాంతాలకు వాతావరణ సమాచారం అందుతున్నది. ఇదే రాడార్లో 150 డివిజన్ల పటాలను చేర్చి..వార్డుల వారీగా సమాచారాన్ని తీసుకుంటున్నారు.