సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం కలిసొచ్చింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది. 30 సర్కిళ్ల పరిధిలో సీఎస్సీ సెంటర్లు, బిల్ కలెక్టర్లు, మీ సేవా, ఆన్లైన్ల ద్వారా చెల్లింపుల ద్వారా రూ.800కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నది. ఇందులో భాగంగా 30సర్కిళ్లకు గాను 7.27 లక్షల మందికి పైగా వినియోగదారులు ఎర్లీబర్డ్స్కీంను సద్వినియోగం చేసుకున్నారు. దీంతో రూ.820 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకొని నిర్దేశిత రూ.800కోట్ల లక్ష్యాన్ని దాటింది. ఆన్లైన్లో రూ.400 కోట్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల ద్వారా రూ.250 కోట్లు, రూ.155 కోట్లకు పైగా సీఎస్సీ సెంటర్లు, మీ సేవా సెంటర్ల ద్వారా ఎర్లీబర్డ్ చెల్లింపులు జరిగాయి. కాగా గతేడాది రూ.785.84కోట్ల మేర ఎర్లీబర్డ్ వసూలు కాగా.. ఈ ఏడాది సైతం నిర్దేశిత టార్గెట్ను అధిగమించిందని అధికారులు తెలిపారు. చివరిరోజు ఒక్కరోజే రూ.96.61కోట్లు వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదికంటే 34.16 కోట్లు అధనంగా వసూలైనట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనూ ఈ స్థాయి మేర వసూలు రావడం అభినందనీయమని కమిషనర్ రొనాల్డ్ రాస్ కొనియాడారు.