వరద సాఫీగా వెళ్లేందుకు నిర్మించిన నాలాలు వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి చెత్తసేకరిస్తున్నా..చాలామంది ఇండ్లల్లోని పాత పరుపులు, ప్లాస్టిక్ వ్యర్థాలు, దుప్పట్లు, దిండ్లు, గాజు వస్తువులు యథేచ్ఛగా పారేస్తుండడంతో వరద సరఫరాకు ఆటంకం కలుగుతున్నది. గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులు, నాలాలు ఉప్పొంగి కాలనీలన్నీ జలమయమై వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గొలుసుకట్టు చెరువుల ఆధునీకరణ, నాలాల విస్తరణ, సమతుల్యం, వరదనీటి కాల్వల బలోపేతం కోసం ప్రభుత్వం ఇటీవల రూ.858 కోట్లు విడుదల చేసింది. వానాకాలం రాకముందే నాలాల్లో వ్యర్థాలు తీసేందుకు రూ.45.28 కోట్లతో 356 చోట్ల యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు ప్రారంభించింది.
గత ఏడాది అక్టోబరు మాసంలో హైదరాబాద్ చరిత్రలోనే రెండో అతిపెద్ద వర్షం సృష్టించిన బీభత్సానికి నగరంలోని అనేక ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 40వేల పై చిలుకు కుటుంబాలు రోజుల తరబడి కంటిమీద కునుకులేకుండా వరదల్లోనే జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు, కుచించుకుపోయిన చోట నాలాల విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతం కోసం ఇటీవల రూ.858 కోట్లు విడుదల చేసింది. వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కానీ మనం అడ్డుకట్ట వేస్తున్నాం. వరద ముంపునకు మనమే కారణమవుతున్నాం. ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నా.. కొందరు వరద నీటి కాల్వలను డంపింగ్ యార్టులుగా మార్చుతున్నారు. నాలాల్లో యథేచ్చగా పాత పరుపులు, చాపలు, చెద్దర్లు వేస్తున్నారు. కొందరు స్థానిక ప్రజలతో పాటు వ్యాపారస్తులు నిబంధనలను ఉల్లంఘించి ఘన వ్యర్థాలను మురుగునీటి కాల్వల్లో పడేస్తున్నారు. దీంతో మురుగునీటి కాల్వల ప్రవాహం అడ్డుకోబడి పొంగిపొర్లడంతో పాటు ముక్కుపుటాలదిరే దుర్వాసన వెదజల్లుతున్నది.
జీహెచ్ఎంసీ రూ.45.28కోట్లతో 356నాలాల పూడిక తీత పనులను చేపట్టింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ పూడికతీత పనులను మరింత వేగవంతం చేయడానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జోన్కు ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజినీర్ను పర్యవేక్షణ అధికారిగా జీహెచ్ఎంసీ నియమించింది. నగరంలో ఉన్న దాదాపు 951 కిలోమీటర్ల విస్తీర్ణంలో మేజర్ నాలాలు, చిన్న నాలాలు, డ్రైన్ల పూడికతీత పనులను జూన్లో పడే వర్షాల కన్న ముందుగానే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మేజర్ నాలాల్లో మిషన్ల ద్వారా వరద నీటి కాలువల్లో జెట్టింగ్ మిషన్ల ద్వారా, పైపులైన్ డ్రైన్లలో రిసైక్లర్స్ ద్వారా, చిన్న సైజు నాలాల్లో మ్యాన్వల్గా పూడికతీత పనులు కొనసాగుతున్నాయి.
వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర బృందాలను రంగంలోకి దింపేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం వర్షాకాలంలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ఈ బృందాలు పనిచేస్తాయి. జూన్ 1 నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు 170 బృందాలు నిర్విరామంగా పనిచేయనున్నారు. వీటితో పాటు 92 లోకేషన్లలో ప్రతి లోకేషన్కు ఇద్దరు లేబర్స్ ఉంటారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోసేందుకుగాను వివిధ సర్కిళ్లకు 202 పంపు సెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లోని నాలాలు, డ్రైన్లలో చేపట్టిన పూడిక తీత పనుల్లో పెద్ద ఎత్తున పాత పరుపులు, చాపలు, చెద్దర్లు , ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గాజు ముక్కలు బయటపడుతున్నాయి. వీటితో పాటు కొబ్బరి బోండాలు, గ్లూకోజ్ డబ్బాలు, గంటెలు, స్పూన్లు, చట్నీ గిన్నెలు, ఇసుక, ఇటుక, భవన నిర్మాణ వ్యర్థాలైన చిన్న చిన్న బండరాళ్లు, కాటన్ ముద్దలు, చికెన్, మటన్ బొక్కలు, అన్నం పొట్లాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలు, కండోమ్ ప్యాకెట్లు ఇతర వ్యర్థాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ చేపట్టిన పూడికతీత పనుల్లో దాదాపు 20శాతంకు పైగా ప్లాస్టిక్ సంబంధిత వ్యర్థాలు ఉంటున్నాయని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు నాలాల్లో వేయడం వల్ల మురుగునీటి ప్రవాహం ఆగిపోయి దోమలు, దుర్వాసనకు కారణమవుతున్నాయి. హోటల్స్ , లాడ్జిలు, మెస్లు, టిఫిన్ సెంటర్లు, ఫంక్షన్హాల్స్, సినిమాహాల్స్ , దవాఖానలు, పరిశ్రమలు, డెయిరీ ఫాంలు, ఇతర వాణిజ్య సంస్థలు నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.