సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను వసూళ్ల నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు ఫెయిలయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్ను కమిషనర్ ఖరారు చేయగా..దాదాపుగా రూ. 1900కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే నిర్ధేశిత లక్ష్యంలో రూ. 200 కోట్ల మేర వెనుకబడిపోయారు. మార్చి నెలలో వసూళ్లను పెంచే క్రమంలో మొండి బకాయిదారులకుగానూ 90శాతం వడ్డీ రాయితీతో ఓటీఎస్ స్కీంను తీసుకువచ్చారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు.
మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సర వసూళ్లు వెనుకబడటంలో కారణాలు లేకపోలేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ప్రజాపాలనలో అధికారులు విధులు నిర్వర్తించి ఆస్తిపన్ను వసూళ్లను పట్టించుకోకపోవడం, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం..అన్నింటికంటే మించి ప్రత్యేక అధికారులను నియమించిన ఫలితాలను రాబట్టడంలో అధికారులు విఫలమయ్యారనే చెప్పాలి. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పౌర సేవా కేంద్రాలను నడిపించగా..చివరి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదని అధికారులు చెబుతున్నారు.