సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణతో సన్నద్ధమైంది. గత అనుభవాల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినా.. రోడ్లపై నీరు నిలవకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ మేరకు వర్షాకాల సమస్యల పరిష్కారానికి దాదాపు రూ. 32.96 కోట్ల ప్రత్యేక బడ్జెట్తో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలాల పూడికతీత పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వరద ప్రభావిత ప్రాంతాలపై పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్ (పర్యవేక్షకులు)గా నియమించనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద అంచనాను బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు చెరువుల వరదపై అప్రమత్తంగా ఉండటం లాంటి చర్యలు చేపట్టనున్నారు. నాలాలతో పాటు చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి సర్కిల్కు ప్రత్యేక వాహనాలతో మాన్సూన్ బృందాలను నియమించనున్నారు.
శరవేగంగా పూడికతీత
వర్షాకాలంలో వరద ముంపు సమస్య తలెత్తకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఎస్ఎన్డీపీలో భాగంగా రూ. 858 కోట్లతో నాలాల అభివృద్ధి, విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. మే నెలాఖరు కల్లా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నాలాల పూడికతీత పనులపై దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలోమీటర్ల పొడవునా నాలాలు, వరద నీటి కాలువలు ఉన్నాయి. గత ఏడాది రూ. 41.38 కోట్లతో 345 పనులు చేపట్టి మొత్తం 5.15 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పూడికతీత పనులు చేపట్టారు. ఈసారి 356 పనులను రూ. 44.45 కోట్లతో చేపట్టగా, ఇప్పటి వరకు 4.59 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నాలా పూడికతీత పనులు చేపట్టారు. ఆరుగురు ఎస్ఈలు, ఆయా జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో పూడికతీత పనులు సాగుతున్నాయి. పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్, వెబ్సైట్ను రూపొందించారు. ఏ రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయి.? ఏ మేరకు పనులు జరిగాయి.? అనే అంశాలను పరిశీలిస్తూ పనులను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఎన్ఎన్డీపీ మొదటి దశ పనులను మే నెలాఖరు నాటికల్లా పూర్తిచేసి వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టనున్నారు.