24/7 నిరంతరాయ సరఫరా
గ్రేటర్ పరిధిలో మార్చిలోనే అత్యధికంగా వినియోగం
నగర వ్యాప్తంగా భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
వేసవి ధాటికి గిర్రున తిరుగుతున్న కరెంటు మీటర్లు
గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా నమోదు
మే నాటికి 8 కోట్లకు చేరుకోవచ్చని అంచనా
ఎంత డిమాండ్ వచ్చినా సరఫరా చేస్తాం
విద్యుత్ అధికారుల వెల్లడి
వేసవి ధాటికి నగరంలో కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నయ్. ఉన్నట్టుండి వారం రోజుల వ్యవధిలోనే అరకోటి యూనిట్ల వాడకం పెరిగింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరువవుతున్న తరుణంలో మధ్యాహ్నం, రాత్రి వేళల్లో నగరవాసులు ఉపశమనం కోసం కూలర్లు, ఏసీలు వాడుతున్నారు. దీంతో శనివారం ఒక్కరోజే విద్యుత్ వినియోగం 6.5 కోట్ల యూనిట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే రోజు 5.5 కోట్ల యూనిట్లు మాత్రమే ఉండడం గమనార్హం. మే నెలలో విద్యుత్ వినియోగం 8 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఎంత భారీగా వచ్చినా సరఫరాలో మాత్రం ఏ లోటూ రానీయమని చెబుతున్నారు.
సిటీబ్యూరో, మార్చి 26(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఈ డిమాండు మరింత పెరిగి 7.8 కోట్ల యూనిట్ల నుంచి 8 కోట్ల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
రోజు వారి విద్యుత్ వినియోగంలో ఫీక్ అవర్స్ వినియోగం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా 3000 మెగావాట్ల నుంచి 3300 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండు ఉంటోంది. మార్చి మొదటి వారం వరకు 5.1 కోట్ల యూనిట్లు (51 మిలియన్ యూనిట్లు) ఉండగా, రెండో వారంలో 5.7 కోట్ల యూనిట్లు దాకా ఉండగా, గత నాలుగు రోజులుగా క్రమంగా పెరుగుతూ ఒకేసారి 6.5 కోట్ల యూనిట్లకు చేరుకుంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలు ఉంటే… సోమవారం నుంచి 39 డిగ్రీలు ఉంటుందని, దీంతో మార్చి చివరి నాటికి మరింత పెరుగుతుందని అంచనా. ఇక రానున్న ఏప్రిల్, మే నెలలో ఈ డిమాండు అత్యధికంగా ఉండే నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతరం, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చోట అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాట్లు చేస్తున్నామని ఆపరేషన్స్ డైరెక్టర్ తెలిపారు. ఎంత డిమాండు వచ్చినా సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, దానిని సరఫరా చేయడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించామని అధికారులు తెలిపారు.