సిటీబ్యూరో, మే 18, (నమస్తే తెలంగాణ) : మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం…మరోవైపు గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ..దీనికి తోడు జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లంతా పనులను ఎక్కడికక్కడ నిలిపివేసి.. సమ్మె సైరన్ మోగించారు. దీంతో జీహెచ్ఎంసీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు, కరెంట్ పోల్స్, పార్కులు, ప్లే గ్రౌండ్, శ్మశానవాటికల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇలా మెయింటెనెన్స్ పనులు చేపట్టే కాంట్రాక్టర్లంతా పనులు నిలిపివేసి శనివారం నుంచి బంద్లోకి దిగారు. రూ. 1350 కోట్ల బకాయిలు చెల్లించే వరకు మా నిరసన ఆగదంటూ బల్దియాకు అల్టిమేటం జారీ చేశారు. తొలి రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాంట్రాక్టర్ల అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.
‘వీ వాంట్ పేమెంట్స్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘ఎవరినీ కష్టపెట్టడం మా ఉద్దేశం కాదు…బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి, చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని బతకలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులకు డబ్బులు లేక, వర్కర్లకు ఈపీఎఫ్, బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, ఆర్థిక బాధలతో సడెన్ స్ట్రోక్లకు గురై ప్రాణాలు పోతున్న పరిస్థితులు వచ్చాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ. రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నెలన్నర రోజుల కిందటే కమిషనర్ రోనాల్డ్ రాస్ను కలిసి పరిస్థితిని వివరించామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని, అందుకే నిరసన బాట పట్టామని చెప్పారు. సీఆర్ఎంపీ, ఎస్ఆర్డీపీ వంటి ప్రాజెక్టులు చేస్తున్న బడా కాంట్రాక్టర్లకు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి మరీ ఇస్తున్నారని, మా లాంటి చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
‘మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినా.. మేం తలొగ్గేదే లేదు’ అవసరమైతే రానున్న రోజుల్లో ఇప్పుడు చేస్తున్న పనులే కాక వర్షాకాలం సంబంధించిన ఐఆర్టీ, మాన్సూన్ పనుల టెండర్లలో పాల్గొనబోమని రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. తమ బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కాంట్రాక్టర్లు బంద్లోకి వెళ్తామని సమాచారం ఇచ్చినా, స్వయంగా బంద్లోకి వెళ్లినా.. కమిషనర్ మాత్రం వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.