సిటీబ్యూరో, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ) : ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. బంజారాభవన్లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. మాక్ పోలింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పీవో, ఏఈపీవోలకు అన్ని విషయాలపై ఎఎల్టీఎంలు స్పష్టంగా అవగాహన కల్పించాలని చెప్పారు. గతంలో పనిచేశాం కదా.. అని ఎవ్వరూ కూడా తేలికగా తీసుకోవద్దన్నారు. పోలింగ్ బూత్ లోపల.. బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 నింపి ఇవ్వాలని సూచించారు. మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదన్నారు. పోలింగ్ నిర్వహించే సిబ్బందికి ఏప్రిల్ 1, 2న ఏఆర్వో స్థాయిలో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగినా.. ఎన్నికల కమిషన్ చేపట్టే చర్యలకు గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.