సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : వీధి వ్యాపారులు, షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీధి వ్యాపారులు, వాణిజ్య దుకాణాల యజమానులు చెత్త డబ్బాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని, స్వచ్ఛ ఆటోల్లోనే చెత్త వేయాలని చెప్పారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో జోనల్ కమిషనర్లు, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం, స్ట్రీట్ స్వీపింగ్ మిషన్స్ పర్యవేక్షణ, జీవీపీల తొలగింపు, సీ అండ్ డీ వేస్టేజ్, తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఎస్డబ్ల్యూజీ కార్మికుల హాజరును పర్యవేక్షించాలని, శానిటేషన్ వర్కర్ల హాజరుకు సంబంధించి మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిన్ పాయింట్ ప్రోగ్రాం చేయాలని, స్వీపింగ్ యంత్రాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శించాలని తెలిపారు.
సీ అండ్ డీ వ్యర్థాలను అక్రమంగా డంపింగ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టోల్ ఫ్రీ నంబర్, మొబైల్ ఆప్లికేషన్లకు సంబంధించి నౌరులకు, ట్రక్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని పలు ఏరియాలలో నిర్మాణాలు చేపడుతున్న వారు నిర్మాణ మెటీరియల్ను రోడ్డుపైనే వేస్తున్నారని, అలాంటి వారికి జరిమానా విధించాలని, మెటీరియల్ను సీజ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. జోనల్ స్థాయిలో అదనపు వాహనాలను అందించాలన్నారు. అన్ని మురికివాడల్లో ఎస్ఎల్ఎఫ్లతో అవగాహన కల్పించాలని, బల్క్ వేస్ట్ జనరేటర్లను పునరుద్ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, చంద్రకాంత్రెడ్డి, సునంద, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, జోనల్ కమిషనర్లు రవికిరణ్, హేమంత్ బోర్కడే, అభిలాష్ అభినవ్, వెంకన్న, పీడీ సౌజన్య, స్వచ్ఛ భారత్ పీడీ భరత్కుమార్, ఏఎంహెచ్ఓలు పాల్గొన్నారు.