సిటీబ్యూరో, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ నోడల్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, పోలీస్ డిప్యూటీ కమిషనర్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, జీఎస్టీ, ఎస్ఎల్బీసీ, ఆర్బీఐ కస్టమ్స్ సీబీటీటీ, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో శుక్రవారం కలిసి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సమీక్షించారు. ఈ సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో మద్యం, ధన ప్రవాహం లేకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమష్టిగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీస్, జీఎస్టీ జాయింట్గా ఆపరేషన్ నిర్వహించాలన్నారు. ఆన్లైన్ నగదు బదిలీపై ఆర్బీఐ, ఎస్ఎల్బీసీ చర్యలు తీసుకోవాలన్నారు.
గుర్గావ్, ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను నియంత్రించడానికి అవసరమైన చోట్ల చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నార్కోటిక్ ద్వారా గంజాయి నియంత్రణకు విజయవాడ రోడ్ పెద్ద అంబర్పేట, ఘట్కేసర్ సరిహద్దుల్లో తదితర ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహించాలన్నారు. ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ / నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
సెక్టోరల్ అధికారులు విధులు హాజరు కానీ పక్షంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్లు, పోలీస్, జీఎస్టీ, ట్యాక్స్, కస్టమ్స్, ఆర్బీఐ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో శుక్రవారం గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు. శిక్షణ పొందిన అధికారులు ఎన్నికల నిధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, అభిషేక్ అగస్త్య, డీఆర్వో హరిప్రియ, శిక్షణ పొందిన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.