సిటీబ్యూరో: బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివిలియన్స్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్ఎస్) పరిధిలోకి బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా నేడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి వద్ద నిర్వహించే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం ద్వారా అవినీతి, అక్రమాలు జరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సీఆర్ఎస్ విధానం ద్వారా అక్రమాలకు తావులేకుండా ఉంటుందని అధికారులు భావించారు.
ప్రస్తుతం ఈ విధానం జీహెచ్ఎంసీ అవతల ఉన్న మున్సిపాలిటీలలో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విధాన అమలుపై పూర్తిగా అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి తొలుత శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సీఆర్ఎస్ విధానం అమల్లోకి వస్తే జనన, మరణాల సంఖ్య సెకన్లో అప్డేట్ అయి దేశ వ్యాప్త వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది.