GHMC | కొండాపూర్, మార్చి 11 : ఐటీ జోన్లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు.
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని దుర్గం చెరువును జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జలమండలి, ఎస్ఎన్డీపీ విభాగాల అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జలమండలి చేపట్టనున్న మురుగునీటి డైవర్షన్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎస్ఎన్డీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పురోగతిని ఆయన పరిశీలించారు.
అనంతరం బల్దియా కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ… మురుగనీటిని దారి మళ్లించేలా పటిష్టమైన డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ మురుగునీటి పరిమాణాన్ని తట్టుకునేలా తగినంత మోతాదులో పైపుల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వర్షపు నీరు స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ ద్వారా చెరువులోకి చేరేలా పటిష్టమైన నాణ్యతతో నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దుర్గం చెరువులో పరిశుభ్రమైన జలాలు నింపి ఆహ్లాదకరమైన పరిసరాలను నగర ప్రజానీకానికి అందించేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని కమిషనర్ సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు.
కమిషనర్తో పాటు శేర్లింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ ముకుంద రెడ్డి, ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ దుర్గాప్రసాద్, డిఈ ఆనంద్, ఎలక్ట్రికల్ ఈఈ మల్లికార్జున్, టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకటరమణ, హెచ్ఎండబ్ల్యూఎస్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ పద్మజ, అధికార, సిబ్బంది ఉన్నారు.