సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500 నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నది. అధికారులు వివిధ వ్యాపారస్తులు, దుకాణాదారులే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీలు భవన నిర్మాణ వ్యర్థాలు వేసే వారిపై దృష్టి సారించింది.
రోడ్ల మీద చెత్త వేసినందుకు ఇప్పటి వరకు సీసీఎంఎస్ ద్వారా రూ. 58.95 లక్షల జరిమానాలు విధించారు. 30 సర్కిళ్ల పరిధిలో 3,138 చలాన్లు జారీ చేయగా రూ. 58.95 లక్షల జరిమానాలు విధించారు. 2,154 మంది పెనాల్టీలు కట్టగా.. రూ.22.32 లక్షల ఆదాయం ఖజానాలో చేరింది. 984 చలాన్లకు సంబంధించి రూ. 36.62 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. సరాసరిగా ఒక్క రోజులో లక్ష వరకు పెనాల్టీలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ వేసిన వారిని గుర్తించి వారిపై చలాన్లు విధిస్తున్నారు.
ఇందులో భాగంగానే 30 సర్కిళ్లలో 522 చలాన్లు జారీ చేయగా, రూ.46.85 లక్షల జరిమానాలు విధించారు. 218 చలాన్లకు రూ.13.80 లక్షల జరిమానాలు వసూలయ్యాయి. 304 మంది నుంచి రూ.33.05 లక్షల మేర వసూలు కావాల్సి ఉంది. స్పెషల్ డ్రైవ్లు పెట్టి జరిమానాల విధిస్తున్నారు సరే మరీ ఇంటింటి చెత్త సేకరణలో ఎందుకు నిర్వహణ సరిగా చేపట్టడం లేదంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.