Hyderabad | హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లేదారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి అర్ధరాత్రి డీఆర్ఎఫ్ టీమ్స్కు 50 ఫిర్యాదులు అందాయి. వర్షపు నీటికి పురాతన భవనాలు చాలావరకు తడిసిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. కాగా, మియాపూర్లో 7.38 సెం.మీ., టోలీచౌకి 6.65 సెం.మీ., హైదర్నగర్ 5.68 సెం.మీ., మాదాపూర్ 5 సెం.మీ., కేపీహెచ్బీ 4.95 సెం.మీ., మూసాపేట 4.73 సెం.మీ., జూబ్లీహిల్స్ 4.65 సెం.మీ. వర్షపాతం నమోదైంది.