సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ప్రధానంగా మహిళలకు భద్రతా విషయంలో జీహెచ్ఎంసీ భరోసా కల్పిస్తున్నది. రద్దీ ప్రాంతాల్లో మహిళలకు అత్యవసర వీలుగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, శేరి లింగంపల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలో ఒక్కో జోన్కు రెండు మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మరో 12 మొబైల్ షీ టాయిలెట్లను సమకూర్చేందుకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. ఈ 12 వాహనాలను జోన్కు రెండు చొప్పున కేటాయించనున్నారు. దాదాపు ఒక్కో వాహనానికి రూ.45 లక్షల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఈ ప్రత్యేక మొబైల్ షీ టాయిలెట్ ఉంటుంది. ఎక్కువగా జన సాంద్రత గల ప్రాంతాలు మార్కెట్లు, విద్యా సంస్థలు, సభలు, సమావేశాలు జరిగే ఏరియాలలో ఈ వాహనాలను అందుబాటులో తీసుకువస్తున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పోలీస్ శాఖ సమన్వయంతో ఈ వాహనాలను తీసుకువస్తామని, భవిష్యత్తులో గ్రేటర్ వ్యాప్తంగా అమలు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
వాహనంలో ప్రత్యేకతలు
ఒకే వాహనంలో ఇండియన్, వెస్ట్రరన్ మోడల్లో టాయిలెట్స్ ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన, నిల్వ ఉంచిన వ్యర్థాలను మున్సిపల్ సీవరేజి ట్యాంకుకు అనుసంధానం చేస్తారు. ఒక ట్యాంకును తీసి మరో ట్యాంక్ను అమర్చుకునే సౌకర్యం ఉంటుంది. 2 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ అమర్చుతారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు (బెస్ట్ ఫీడింగ్) గదులు ఉంటాయి. మడత కుర్చీలు, చిన్నారులకు డైపర్ ఛేంజ్ చేసుకునేందుకు టేబుల్ అందుబాటులో ఉంటుంది. మహిళలకు సౌకర్యవంతంగా పరికరాలను, సామగ్రి పెట్టుకునేందుకు లాకర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. సింక్, వాష్ ప్రాంతాల్లో మిర్రర్స్ ఉంటాయి.