సిటీబ్యూరో/మేడ్చల్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): ఓటుకు సీటు వ్యవహారంతో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడుతోంది. టికెట్ల పంపిణీలో రేవంత్ చేతివాటం ఆరోపణలతో క్యాడర్ మరింత బేజారైపోతోంది. రెండో దఫా జాబితా వెల్లడితో మొదలైన అసంతృప్తి సెగలు గ్రేటర్ కాంగ్రెస్ క్యాడర్ను చెల్లాచెదురు చేశాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకునే కాంగ్రెస్ను ముంచేలా అసమ్మతి నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రేవంత్ వర్గం చేసిన బాగోతానికి ఆగ్రహంతో ఊగిపోతున్న అసమ్మతి నేతలు.. ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు ఖరారైనా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలతో ప్యారాచూట్ నేతలు ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు. దీంతో గ్రేటర్లో డిపాజిట్ ఆశలు కూడా లేకుండా పోతాయని హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు రేవంత్ రెడ్డిని తిట్టిపోసుకుంటున్నారు.
సర్వేల పేరిట కొందరిని, ఫ్యామిలీ టికెట్ల పేరిట మరి కొందరిని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి.. మొత్తానికి ప్యారాచూట్ నేతలను రంగంలోకి దింపాడు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన నేతలను కరివేపాకులా తీసిపారేశాడు. పార్టీకి సేవ చేసిన వారికంటే జేబులు నింపిన వారికే టికెట్లు దక్కాయని బహిరంగంగానే అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండో జాబితా వెల్లడించిన తర్వాత గ్రేటర్లోని పరిస్థితి కాంగ్రెస్ను కుదుపేస్తోంది. ఇన్నాళ్లు పార్టీ జెండాను మోసిన నేతలు రేవంత్ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్నారు. కొందరైతే నేరుగా ఎన్నికల్లో పార్టీకి సహకరించేదే లేదని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి శనివారం వీరంగం సృష్టించాడు. ఆదివారం ముఖ్య నేతలతో నియోజకవర్గంలో సమావేశం నిర్వహించిన పీవీఆర్.. పార్టీని నమ్ముకున్న వారికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవైపు బీఆర్ఎస్ ప్రచారంపై దృష్టి పెట్టుకుని ఎన్నికల సమరంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్లో అసమ్మతి సెగలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయి. గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటించారు. కానీ, ఇప్పటికీ అభ్యర్థులు పార్టీ కార్యకర్తలను కలుపుకొని ప్రచారం మాత్రం మొదలు పెట్టలేదు. మేడ్చల్ జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినా.. ఏ ఒక్క స్థానంలో కూడా ప్రచారం చేయలేకపోతున్నారు. కూకట్పల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడిన గొట్టిముక్కల వెంగళరావు కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని బీఆర్ఎస్లో చేర్చుతున్నట్లుగా పేర్కొన్నారు.
కూకట్పల్లి నుంచి టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళరావు ముఖ్య అనుచరులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. జంటనగరాల్లో పీజేఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న, కట్టర్ కాంగ్రెస్ నేతగా చెప్పుకునే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి జరిగిన అన్యాయంపై తీవ్ర అసహనంలో ఉన్నాడు. తాను మెచ్చిన, జేబులు నింపిన నేతలకే టికెట్లను అప్పగించి.. ఇన్నాళ్లుగా పార్టీ జెండా మోసినవారికి అన్యాయం చేస్తున్నాడని నేతల్లో ఆగ్రహాం వ్యక్తం అవుతున్నది. రెండో జాబితాలోనూ టికెట్ల ఆశలు గల్లంతైన నేతలు, పార్టీల పక్క చూపులు చూస్తుండటంతో ఎన్నికల నాటికి మరిన్ని వలసలు పెరిగేలా ఉన్నాయి. మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతుండగా… గ్రేటర్లోనూ కాంగ్రెస్ ఆశావహులకు బీఆర్ఎస్ చుక్కానిలా నిలుస్తోంది.
బడంగ్పేట : సీటుకు నోటు అంశంతో మహేశ్వరం కాంగ్రెస్లో మంటలు చెలరేగాయి. స్థానికేతరుడైన కిచ్చనగారి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. కేఎల్ఆర్ పోటీ నుంచి తప్పుకోవాలని.. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. స్థానికులైన చిగిరింత పారిజాతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తుంటే.. తనకే టికెట్ ఇవ్వాలని మరోనేత దేపా భాస్కర్ రెడ్డి తన బలగంతో సమావేశమాయ్యారు. ఆదివారం బాలాపూర్ చౌరస్తాలో ఉన్న సీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో తనకే మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చిగిరింత పారిజాత తన అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. అదిష్ఠానానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి జై హింద్, బాలు నాయక్, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్రెడ్డి, బాలు నాయక్, గ్రంథాలయ మాజీ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మరోనేత దేపా భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా నర్సింహారెడ్డి, జంగారెడ్డి, అమరేందర్రెడ్డి వారివారి అనుచరులతో మాట్లాడుతూ.. మాలో ఒకరికి టికెట్ ఇచ్చినా.. కలిసి పనిచేస్తామన్నారు.
అంబర్పేట, అక్టోబర్ 29: అంబర్పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు పుట్టుకొచ్చాయి. టికెట్ను ఆశించిన వారు ఒక్కొక్కరుగా తమ బాధను, అక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కో- ఆర్డినేటర్ అంబర్పేట శ్రీనివాస్యాదవ్ ఆదివారం మీడియా సమావేశం పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేవంత్రెడ్డి అంబర్పేట టికెట్ అమ్ముకున్నాడు.. బీసీల అన్యాయనేత వి.హనుమంరావు ఉన్నంత వరకు అంబర్పేటలో పార్టీ బాగుపడదు.. అంటూ ఆరోపించారు. బస్తీల పేర్లు తెలవని రోహిన్రెడ్డికి టికెట్ ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా.. పార్టీ రెబల్గా పోటీ చేస్తానని పేర్కొన్నారు.
సుల్తాన్బజార్, అక్టోబర్ 29: కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్లను కేటాయించాలంటూ ఆదివారం గాంధీభవన్ ఎదుట నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. కోవర్టు అయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి హటావో.. కాంగ్రెస్ పార్టీకి బచావో.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఓటుకు నోటు దొంగ అయిన రేవంత్రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందన్నారు. దాదాపు పది మంది కార్యకర్తలు తమ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఆవుల రాజిరెడ్డికి టికెట్ ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి నాయకుడిగా కొనసాగుతున్న గాలి అనిల్కుమార్కే టికెట్ కేటాయించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో చేరుకున్న అనిల్కుమార్ వర్గీయులతో గాంధీభవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.