కొండాపూర్, జనవరి 12 : చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, బక్షికుంట చెరువుల అభివృద్ధి పనులను కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణతో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని గంగారం పెద్ద చెరువు అభివృద్ధి పనులను ఇరిగేషన్ శాఖ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ చేసినట్లు తెలిపారు.
చెరువులతో పాటు చెరువులోకి మురుగు నీరు చేరకుండా డ్రైనేజీ వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరిగేషన్, హెచ్ఎండీఏల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎస్ఆర్ కింద ఫినోమ్ పీపుల్ ఐటీ సంస్థ బైరీ ఫౌండేషన్ ద్వారా చందానగర్లోని బక్షికుంట చెరువు సుందరీకరణకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఈఈ పద్మ, డీఈ జగన్మోహన్, ఏఈ జీవన్రెడ్డి, ఏఈ శివకుమార్, ఆర్ఐ శ్రీనివాస్, టీపీఎస్ మధు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, నరేందర్, రవిచంద్ర, సందీప్, అవినాశ్, తదితరులు పాల్గొన్నారు.
పటేల్చెరువు అభివృద్ధిపనులు పరిశీలన
మాదాపూర్, జనవరి 12: చెరువుల సుందరీకరణకు నిరంతరం పాటుపడుతు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, చెరువులో కలుషిత నీరు కలువకుండా చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకు రావాలని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు అభివృద్ధిలో భాగంగా రూ.12.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను గురువారం మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో పాటు హెచ్ఎండీఏ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, చెరువుకట్టను పటిష్ట పరిచేలా పునరుద్ధరణ, మురుగునీరు చెరువులో కలువకుండా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాలువ నిర్మాణం, అలుగు మరమ్మతులు, చెరువు కట్ట బలోపేతం, వాకింగ్ ట్రాక్ వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు ఈఈ పద్మ, డీఈ జన్మోహన్, ఏఈ జీవన్రెడ్డి, ఏఈ శివకుమార్రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టీపీఎస్ మధు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.