సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 ( నమస్తేతెలంగాణ): గణపయ్య లడ్డూలు వేలంపాటలో అధిక ధరలు పలికి సరికొత్త రికార్డు సృష్టించాయి. లంబోదరుడి చేతి లడ్డూలను దక్కించుకోవడం కోసం భక్తులు ఉత్సాహం చూపారు. గత ఏడాది కరోనాతో వేలంపాట నిలిచిపోయిన విషయం విధితమే. కాగా ఈయేడు లడ్డూను సొంతం చేసుకోవడానికి అమితాసక్తి ప్రదర్శించారు. అన్ని పూజలకు ఆది దేవుడైన గణనాథుడి లడ్డూ వేలం ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. వేలంపాటలో మళ్లీ ఈ ఏడాది బండ్లగూడ లడ్డూ టాప్లో నిలిచింది. 2019లో రూ.18.51 లక్షలు ధర పలుకగా ఈసారి ఏకంగా రూ.41 లక్షల ధర పలికింది. ఈ లడ్డూను రిచ్మండ్ విల్లా సభ్యులు కైవసం చేసుకుని రికార్డును నిలుపుకున్నారు. రెండో స్థానంలో బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.18.90లక్షల ధర పలికింది.
ఈ లడ్డూను ఏపీకి చెందిన కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మర్రి శశాంక్రెడ్డిలు భాగస్వాములుగా దక్కించుకున్నారు. మూడో స్థానంలో మైహోంభుజ లడ్డూను వ్యాపారవేత్త విజయభాస్కర్ రెడ్డి రూ. 18.50లక్షలకు కైవసం చేసుకున్నారు. నాలుగోస్థానంలో బడంగ్పేట లడ్డు రూ. 10లక్షలు ధర పలికింది. మరోవైపు బాగ్లింగంపల్లి యాదాద్రి కాలనీలో వక్రతుండాయ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో నిర్వహించిన స్వామి వారి లడ్డూను అదే కాలనీకి చెందిన ముస్లిం సోదరుడు ముస్తఫా రూ.75,200లకు దక్కించుకొని మతసామరస్యాన్ని చాటాడు.
బడంగ్పేట, సెప్టెంబర్19: బాలాపూర్ గణనాథుడి లడ్డూ రికార్డు ధర పలికింది. హోరాహోరీ వేలం పాటలో లడ్డూను నాదర్గుల్కు చెందిన అబాకస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు మర్రి శశాంక్రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.90లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో 30 మంది పాల్గొన్నట్లు ఉత్సవ సమితి నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందులో 27 మంది స్థానికులు కాగా ముగ్గురు స్థానికేతరులు ఉన్నారు. ఉత్సవ సమితి లడ్డూ వేలం పాట 1,116తో ప్రారంభించారు. అనంతరం శశాంక్రెడ్డి, రమేశ్యాదవ్, శ్రీకాంత్రెడ్డి మధ్య వేలం పాట పోటాపోటీగా జరిగింది. ఉదయం 10 గంటలకు వేలం పాట పూర్తి అయింది.
2019లో రూ. 17.60లక్షలకు కొలన్ రాంరెడ్డి దక్కించుకోగా గతంలో కన్నా ఈ సంవత్సరం రూ.1.30లక్షలకు లడ్డూ ధర పెరిగింది. అంతకు ముందు ఉదయం 6.15 గంటలకు బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపుగా గణనాథుడు భజన పాటలతో పుర వీధుల గుండా గ్రామ ప్రధాన కూడలి బొడ్రాయి దగ్గరకు తీసుకొచ్చారు. అనంతరం భారీ జన సందోహం మధ్యన గణనాథుడి ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి,రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.