గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీధివీధినా కొలువుదీరిన గణనాథులు భక్తులచే ఘనమైన పూజలందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. మండపాల్లో పూజలందుకుంటున్న వినాయక ప్రతిమలు వివిధ ఆకృతుల్లో భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
గణపయ్య కల్యాణ మహోత్సవం
మారేడ్పల్లి, సెప్టెంబర్ 22 : సికింద్రాబాద్ గణపతి ఆలయంలో కల్యాణ గణపతి అలంకరణలో గణనాథుడు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. గణపతి స్వామి వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 10 వేల మంది భక్తులు కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. అనంతరం స్వామి వారి 50 కిలోల లడ్డూకు వేలం నిర్వహించగా సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన భోవనగిరి శోభ గౌడ్ రూ.లక్షా 30 వేలకు దక్కించుకున్నారు.
గణనాథుడి చేతిలో బంగారు లడ్డు
హిమాయత్నగర్, సెప్టెంబర్ 22 : నారాయణగూడలోని వీధి నం 5లో జై శ్రీ గణేశ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి చేతిలో తులం బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డు ఆకర్షణంగా నిలిచింది.