మణికొండ, సెప్టెంబర్ 11 : గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ జలాశయం నాలుగు గేట్లను ఎత్తి శనివారం అర్ధరాత్రి నుంచే నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట జలాశయం నీటి మట్టం 1790 కాగా.. ఇప్పటికే 1787 అడుగులకు చేరారు. దీంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎగువ ప్రాంత నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తుండటంతో మరిన్నిగేట్లను ఎత్తే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జలమండలి అధికారులతోపాటు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మూసీపై వంతెన నిర్మించాలి..
గండిపేట నిండిందంటే చాలు మంచిరేవుల వాసులకు కష్టాలు మొదలవుతాయి.. ప్రభుత్వం స్పందించి వర్షాలు తగ్గిన వెంటనే మూసీపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆదివారం కౌన్సిలర్ నాగపూర్ణ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పాపిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణభగవాన్రెడ్డి, మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ్ తదితరులు మూసీ కాలువను సందర్శించారు.
మంచిరేవుల వాసులకు తప్పని తిప్పలు..
గండిపేట చెరువునిండితే చాలు ఆ గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం అర్ధరాత్రి నాలుగు గేట్లను ఎత్తివేయడంతో మూసీ కాలువ పొంగుతున్నది. దీంతో నార్సింగి నుంచి మంచిరేవుల గ్రామానికి వెళ్లాలంటే మూసీ కాలువ దాటాల్సి ఉంటుంది. దీంతో రాకపోకలకు ఆ గ్రామప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
పొంగిపొర్లుతున్న ఈసీ, ఎంటేరువాగులు
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 11: రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని ఈసీవాగు, ఎంటేరువాగులు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైయ్యే ఈసీవాగు పూడూరు మండలం మీదగా షాబాద్, శంషాబాద్ మండలంలోని కవేలిగూడ, మల్కారం, కేబిదొడ్డి, సుల్తాన్పల్లి, కవ్వగూడ గ్రామాల మీదుగా హిమాయత్ సాగర్ చెరువులోకి చేరుతుంది. ఎంటేరువాగులో మండలంలోని పాలమాకుల మైసమ్మ చెరువుతో ఒక కాల్వ, నందిగామ మండలంలోని నర్సప్పగూడ గ్రామ చెరువు వైపు నుంచి ఒక కాల్వ రెండు కలిసి శంషాబాద్ మండలంలోని పిల్లోనిగూడ సమీపంలో కలిసి అక్కడి నుంచి నానాజీపూర్, రాయన్నగూడ, సుల్తాన్పల్లి, కేబిదొడ్డి గ్రామాల మీదుగా వచ్చి ఈసీవాగులో కలిసి హిమాయత్సాగర్లోకి వరదనీరు భారీ ఎత్తున వచ్చిచేరుతుంది. ఎంటేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కేబిదొడ్డి-సుల్తాన్పల్లి గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై గుంతపడి రాకపోకలు ఇబ్బందులు కలుగుతున్నాయి.